CBI probe demand DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో  మెగా డీఎస్సీ-2025  నియామకాల చుట్టూ ఇప్పుడు రాజకీయ యుద్ధం ముదిరింది. వైఎస్సార్‌సీపీ ఈ ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తుండగా, ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఎదురుదాడికి దిగారు. అయితే ఎదురుదాడి కాదని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.  ఏపీలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ ఒక  మెగా స్కామ్ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మెరిట్ జాబితాలో అక్రమాలు,  స్పోర్ట్స్ కోటా కింద పోస్టుల విక్రయం వంటివి జరిగాయని ఆయన వాదిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీఈఆర్టీ లో పనిచేసిన ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి స్టేట్ టాపర్‌గా రావడం వెనుక లోతైన కుట్ర ఉందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

 ప్రభుత్వం గట్టి కౌంటర్ 

వైసీపీ ఆరోపణలను ప్రభుత్వం  మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని జగన్‌కు, తమను విమర్శించే నైతిక హక్కు లేదని లోకేష్ మండిపడ్డారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం లీకేజీ అనేది సాంకేతికంగా అసాధ్యమని విద్యాశాఖ వివరణ ఇచ్చింది. సుమారు 16,347 పోస్టులను కేవలం 148 రోజుల్లోనే అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని, నియామక ప్రక్రియపై న్యాయస్థానాలు కూడా క్లీన్ చిట్ ఇచ్చాయని మంత్రి గుర్తు చేశారు.     

Continues below advertisement

 విచారణ ఉంటుందా?  

వైసీపీ కోరుతున్నట్లుగా సీబీఐ విచారణ జరిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్లు తెలుస్తోంది. పైగా, ప్రభుత్వంపై బురద చల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశాఖ హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మెరిట్ జాబితాలను ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచామని అధికారులు స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ , మీడియా సంస్థలకు డెఫమేషన్ నోటీసులు ఇస్తామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది.

 రాజకీయ సమీకరణాలు 

ఈ వివాదం ఇప్పుడు నిరుద్యోగ యువతలో చర్చకు దారితీస్తోంది. వైసీపీ తన ఆరోపణల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని చూస్తుంటే, లోకేష్ మాత్రం జాబ్ క్యాలెండర్ అమలు ద్వారా యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఒక్క అక్రమం జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం  అని లోకేష్ సవాల్ విసరడం ద్వారా ప్రభుత్వం తన పారదర్శకతపై నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చివరగా చెప్పాలంటే, వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమించాలని చూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం రికార్డు స్థాయి సమయంలో నియామకాలు పూర్తి చేశామనే అంశాన్ని తన విజయంగా చెప్పుకుంటోంది. విచారణ సంగతి ఎలా ఉన్నా, ఈ డీఎస్సీ వార్ మాత్రం ఇరు పార్టీల మధ్య యుద్ధాన్ని మరింత వేడెక్కించింది.