Chandrababu PRC IR Strategy:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చైతన్యవంతమైన, ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగ లోకం మళ్లీ పోరుబాటకు సిద్ధమవుతోంది. కొత్త 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి   ప్రకటన, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఉద్యోగ సంఘాలు మళ్లీ తమ గళాన్ని విప్పుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలోనూ ఉద్యోగులను ఆదుకున్న కూటమి ప్రభుత్వం, ఈసారి కూడా తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశతో ఉద్యోగులు ఉండగా.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం సంక్లిష్టంగా మారుతున్నాయి.

Continues below advertisement

చంద్రబాబుపై ఎన్నో అంచనాలు

చరిత్రను తిరగేస్తే.. 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటు సమయంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఊహించని రీతిలో ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగుల అసంతృప్తిని నివారించేందుకు 11వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించడంతో పాటు తాత్కాలికంగా ఐఆర్‌ను కూడా ప్రకటించారు. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలత 27 శాతం ఐఆర్ ప్రకటించినప్పటికీ, పీఆర్‌సీ ఇచ్చేసరికి కేవలం 23 శాతం ఫిట్‌మెంట్‌కే పరిమితం చేయడం ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. హెచ్‌ఆర్‌ఏ కోతలు, పెండింగ్ డీఏలతో జీతాలు సైతం పెరగకపోగా రివర్స్ పీఆర్‌సీ  జరిగిందన్న భావన ఉద్యోగుల్లో బలపడింది.

Continues below advertisement

సరిగ్గా జీతాలు కూడా రాక ఇబ్బందులు

గత ప్రభుత్వ హయాంలో ఒకటవ తేదీన జీతాలు రాక, ప్రావిడెంట్ ఫండ్  , మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి దాదాపు రూ. 20,000 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ అసంతృప్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసార్సీపీ ఓటమికి, టీడీపీ కూటమి ఘనవిజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే తమ సమస్యలన్నీ తీరుతాయని, కొత్త పీఆర్‌సీ వేసి ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిరంతరం సుదీర్ఘ చర్చలు జరుపుతూ, గత ప్రభుత్వం తమపై మోపిన రూ. 30,000 కోట్లకు పైగా ఉద్యోగుల బకాయిల భారాన్ని ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని వివరిస్తున్నారు. దాదాపు రూ. 15,000 కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఉద్యోగుల బకాయిలకు, డీఏలకు విడుదల చేశామని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోంది. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్‌సీ ఛైర్మన్‌ను నియమించి, కనీస మధ్యంతర భృతి ను ప్రకటించాలని పట్టుబడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సవాలే 

ఆర్థికంగా తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, తక్షణమే భారీ ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్‌సీని అమలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఫలితంగా ప్రభుత్వం ప్రస్తుతం  బుజ్జగింపుల వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులను శాంతింపజేస్తూ, పెండింగ్ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తూ, డీఏల విడుదలతో తాత్కాలిక సంతోషాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. పూర్తిస్థాయి పీఆర్‌సీ భారాన్ని ఇప్పుడే మోయడం కంటే, ఐఆర్‌తో కాలయాపన చేస్తూ సర్దుబాటు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం పీఆర్‌సీ లేదా భారీ ఐఆర్ ప్రకటనను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా పదవీకాలం చివరి రెండేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది. ఆరంభంలోనే పీఆర్‌సీ భారాన్ని మోస్తే ఐదేళ్లపాటు ఆర్థిక నిర్వహణ కష్టమవుతుందన్న ఆలోచనలో ఆర్థిక శాఖ ఉంది. అయితే, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలచుకుని ఉద్యోగులను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తుండటంతో, కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతవరకు సామరస్యంగా సమర్థించుకుంటుందనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనుంది.