Nellore YSRCP Incharges: ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన కంచుకోటగా, జగన్మోహన్ రెడ్డికి కొండంత అండగా నిలిచిన నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్సార్ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉన్న జిల్లాలో నేడు ప్రతిపక్షంగా కనీస స్థాయిలో పోరాటాలు చేయడానికి కూడా సీనియర్ నేతలు ముందుకు రాకపోవడం తాడేపల్లి వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
కాకాణి,పర్వతరెడ్డి మాత్రమే యాక్టివ్
ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్సీపీ జెండాను భుజానకెత్తుకుని పోరాడుతున్న నేతల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. కేసులకు, ప్రభుత్వ ఒత్తిళ్లకు వెరవకుండా కాకాణి విమర్శలు గుప్పిస్తుండగా, పర్వతరెడ్డి క్షేత్రస్థాయిలో కొంతవరకు క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు. అయితే, వీరిద్దరి పోరాటం జిల్లా స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతోందనేది వాస్తవం. వీరిద్దరి మినహా మిగిలిన ప్రధాన నాయకులంతా సంపూర్ణమైన సైలెన్స్ పాటించడం లేదా పార్టీకి దూరంగా తటస్థ వైఖరిని అవలంబిస్తుండటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడ పని చేసుకోవాలో క్లారిటీ లేని అనిల్ కుమార్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి జిల్లా వైసీపీలో మరింత అయోమయంగా మారింది. గత ఎన్నికల్లో నెల్లూరు నగరాన్ని వదిలి నరసరావుపేటకు వెళ్లిన ఆయన, అక్కడ ఓటమి చెందిన తర్వాత జిల్లా రాజకీయాల్లో తన స్థానమేంటో తేల్చుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో నెల్లూరు సీటుపై అనిల్కు అధిష్టానం నుంచి స్పష్టమైన గ్యారంటీ లేకపోవడంతో, ఎక్కడ నుంచి పనులు ప్రారంభించాలో క్లారటీ లేక ఆయన నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. ఫైర్బ్రాండ్ నాయకుడిగా పేరున్న అనిల్ నిశ్శబ్దం నగరం, పరిసర ప్రాంతాల కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న మేకపాటి కుటుంబం సైతం దాదాపు తటస్థంగా మారిపోయింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్ సీపీకి మూలస్తంభంగా నిలిచినప్పటికీ, మారిన రాజకీయ సమీకరణాలు, గెలుపోటముల తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వ్యాపార, వ్యక్తిగత కారణాలతో పాటు అధిష్టానం వ్యవహారశైలిపై అసంతృప్తితోనే మేకపాటి కుటుంబం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ప్లాన్ బీ రెడీ చేస్తున్న జగన్ ?
ఇక సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసే వ్యాఖ్యలు, ఇచ్చే పిలుపులు పార్టీకి లాభం చేకూర్చకపోగా, సొంత పార్టీకే ఎదురుదెబ్బలుగా మారుతున్నాయి. ఆయన అనుసరిస్తున్న శైలి క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించేలా చేస్తోందని, కేడర్ను ఏకం చేయడంలో ఆయన విఫలమవుతున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే వస్తున్నాయి. కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి వైఖరి వల్ల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా యాక్టివ్గా పనిచేసే బలమైన నేత ఒక్కరూ కనిపించకపోవడం వైసీపీకి మింగుడుపడటం లేదు. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రక్షాళన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా సమన్వయకర్తలను తక్షణమే మార్చడం, ఆయా ప్రాంతాల్లో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కొత్త రక్తాన్ని ఎక్కించాలని జగన్ భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా సైలెంట్గా ఉన్న సీనియర్లకు అల్టిమేటం జారీ చేసి, పనిచేస్తేనే పదవులు.. లేదంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామనే గట్టి సంకేతాలను తాడేపల్లి కార్యాలయం నుంచి పంపేందుకు ప్లాన్ బి సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
