AP Cabinet Sub Committee Meeting: ఆంధ్రప్రదేశ్ జీపీఎస్ ప్రతిపాదనలపై ఈనెల 29వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. అయితే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపగా.. ఉద్యోగ సంఘాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. రాష్ట్రంలో 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు అంతా కోరుకునేది పాత పెన్షన్ విధానాన్నే అని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నేత కె. రాజేశ్ తెలిపారు. జీపీఎస్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. అలాగే లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై హడావుడి ఆర్డినెన్స్ ఎందుకు తెస్తున్నారని అడిగారు. సెప్టెంబర్ లో జరిగే శాసన సభా సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెడితే చర్చ జరిగే అవకాశం ఉంటుందని వివరించారు.


ఓపీఎస్ అమలు చేస్తున్న రాష్ట్రాలు దేనికి ఆదర్శం


అసెంబ్లీలో చర్చిస్తే.. లోటుపాట్లు బయటకు వస్తాయన్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించి గందగోళానికి గురి చేస్తోందన్నారు. జీపీఎస్ అంటేనే ఉద్యోగులకు నమ్మక ద్రోహం చేయడమే అని రాజేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జీపీఎస్ పై పెట్టిన సమావేశానికి సీపీఎస్ సంఘాలను ఆహ్వానించకపోవడం శోచనీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
బయటకు సీపీఎస్ రద్దు చేసేశామని సర్కారు వట్టి మాటలు చెబుతుందని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ నేత ఎన్. ప్రసాద్ అన్నారు. జీపీఎస్ దేశానికి ఆదర్శం అని సీఎం చెబుతున్నారన్నారు. మరి ఓపీఎస్ అమలు చేస్తున్న రాష్ట్రాలు దేనికి ఆదర్శం అంటూ అడిగారు. మెరుగైన జీపీఎస్ అని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగుల దృష్టికి ఎందుకు తేవడం లేదన్నారు. ప్రతిపాదనలపై చర్చించిన తర్వాతే కేబినెట్ ఆమోదం తీసుకోవాలన్నారు. అలా జరగలేదంటే అసలు మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించే అంశానికి విలువ లేకుండానే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీఎస్ ను అమలు చేస్తున్న రాష్ట్రాలనే ఏపీ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నామన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో అమలు అయ్యేది ఇక్కడ ఎందుకు భారం అవుతుందని ఫైర్ అయ్యారు.


Also Read: No Mobile at Schools: ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో సెల్ ఫోన్లపై నిషేధం, టీచర్లకు సైతం కండీషన్స్


జీపీఎస్ పై సర్కారు ఏం ప్రతిపాదిస్తుందో..!


ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... జీపీఎస్ రద్దు విధానాన్ని ఏపీ కేబినెట్ (AP Cabinet Cancels GPS) ఆమోదించిన విషయం ఉద్యోగ సంఘాల వారికెవరికీ తెలియదన్నారు. జీపీఎస్ పై ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తుందో ఏ ఉద్యోగ సంఘానికి స్పష్టత లేదన్నారు. పీఆర్సీ, కాంట్రిబ్యూషన్ మినహా ఓపీఎస్ లోని అన్ని అంశాలు కూడా జీపీఎస్ లో ఉండాయని సీఎం జగనే చెప్పారని అన్నారు. ఇదే అంశాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అధికారులకు చెప్పామన్నారు. జీపీఎస్ లో కమ్యుటేషన్ పై అధికారులు ఎవరూ స్పష్టత ఇవ్వకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారు.