No Mobile at Schools in Andhra Pradesh:


ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ ఫోన్ల వినియోగంపై సర్కార్ నిషేధం అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.


సెల్ ఫోన్లపై నిషేధం...
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ స్కూళ్లలో సెల్ ఫోన్లపై  నిషేధం అమలులోకి తీసుకువస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై తరగతి జరిగే సమయాల్లో నో సెల్ ఫోన్ అంటూ సిబ్బందికి కూడా స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా ఈ  నిబంధన  పాటించాలని పాఠశాల విద్యా శాఖ  ఆదేశాలు వెలువరించింది. అత్యవసరం అయితే హెడ్మాస్టర్  అనుమతితో మాత్రమే సెల్ ఫోన్ వాడాలని నిబంధన కూడా ఉందని తెలిపారు. 


ఎందుకు ఈ నిర్ణయం...
విద్యా ప్రమాణాలు పెంచడంలో భాగంగా ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లఘించి  ఫోన్ వాడితే రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు కూడ ఇచ్చారు. ఎల్ ఈ డీ  ప్యానల్లు... స్మార్ట్  టీవీలు కేవలం బోధనకు మాత్రమే వాడాలని కూడా సూచించారు. విద్యా విధానం అమలులో ఈ నిర్ణయం చాలా కీలకం కాబోతోందని అదికారులు భావిస్తున్నారు. అయితే అధ్యాపకులు సెల్ ఫోన్ ను వినియోగించకుండా ఉండటం అంటే అంత ఈజీ కాదని కూడ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహరం పై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహరంలో సీరియస్ గా వ్యవహరించాలని భావిస్తోంది. విద్యా వ్యవస్దలో తీసుకువచ్చే మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయాన్ని పరిగణించాల్సి ఉంటుందని, విద్యాశాఖ అదికారులు చెబుతున్నారు.


యునెస్కో సూచనలను పరిగణంలోకి తీసుకొని..
పాఠశాలల్లోని తరగతి గదుల్లో విద్యార్దులు, లేదా ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వినియోగం పై పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండాల్సిందేనని యెనెస్కో ఆధ్వర్యాన ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ వర్గాలకు సూచనలు అందాయి. యునెస్కో ఇచ్చిన సూచనలు మేరకు ఈ నిర్ణయాన్ని ఎట్టి పరస్దితుల్లోఅమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పని తీరును మెరుగు పర్చటంలో భాగంగా ఇలాంటి నిర్ణయలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లుగా చెబుతున్నారు.


సెల్ ఫోన్ తో అన్నీ...
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్దల్లో కూడా సెల్ ఫోన్ వాడకాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించింది. అయితే ఎమిదో తరగతి విద్యార్దులకు మాత్రమే ప్రాథమికంగా ట్యాబ్ ల వాడకాన్ని ప్రభుత్వం సహకరించింది. ఇప్పటికే బై జూస్ వంటి కంటెంట్ లోడ్ చేసి, దాన్ని విద్యార్దులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే సెల్ ఫోన్ లో కంటెంట్ చదవటం వలన విద్యార్థులకు వచ్చే ఇబ్బందులను కూడా పరిగణంలోకి తీసుకొని, కేవలం కొన్ని సందర్బాల్లో మాత్రమే సెల్ ఫోన్ లో ఉన్న కంటెంట్ ను ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంది. అయితే ఇళ్ళలో కూడ విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లకు ప్రాధాన్యత ఇవ్వటం వలన చదవులు అటకెక్కుతున్నాయని, తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు.