తెలంగాణలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌లతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నేడు ఆమె గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగం రాలేదనే మనస్తాపంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం గుండన్నపల్లి గ్రామంలో ఒక రోజు నిరాహార దీక్షా కార్యక్రమంలో పాల్గొననున్నారు.





సీఎం కేసీఆర్ ఇలాకాలో దీక్ష..
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో షర్మిల నిరుద్యోగ దీక్షను చేపట్టనున్నారు. నిరుద్యోగ దీక్షల సందర్భంగా.. ఆమె ఉద్యోగాలు రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న యువత కుటుంబాలను పరామర్శించడంతో పాటు  తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. నేడు కేసీఆర్ ఇలాకాలో దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.


Also Read: YS Sharmila: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కొప్పు రాజు కుటుంబంతో షర్మిల


8 వారాలకు చేరుకున్న దీక్ష.. 
నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి షర్మిల చేపట్టిన దీక్ష 8 వారాలకు చేరుకుంది. దీనిలో భాగంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండా, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం గొల్లపల్లె, నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల, క‌రీంన‌గ‌ర్ జిల్లా ఇల్లంతకుంట మండ‌లం సిరిసేడు గ్రామాల్లో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.



Also Read: YS Vijaya lakshmi Meet : వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ భేటీ వెనుక రాజకీయం అదేనా..? జగన్, షర్మిల హాజరవుతారా..?


Also Read: Breaking News: గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు స్టే