Baba Ramdev targets allopathy: 


ఆధునిక వైద్యం ఇంకా పసిప్రాయంలోనే ఉంది: రామ్ దేవ్ బాబా 


యోగా గురు రాందేవ్ బాబా అలోపతిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టార్గెటెడ్ మెడిసిన్ అనేది క్రూరమైన చర్య అని, హింసను ప్రేరేపించే విధంగా ఉంటోందని అన్నారు. అలోపతి వైద్యం...మానవత్వానికి వ్యతిరేకమని సంచలన కామెంట్స్ చేశారు. మానవత్వాన్ని కాపాడుకోవాలంటే, ప్రపంచమంతా యోగావైపు మళ్లాలని అన్నారు. భారత సంస్కృతిలో భాగమైన నేచురోపతి, ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించాలని సూచించారు. "నేచురల్ మెడిసన్, నేచురల్ హర్బ్స్, నేచురల్ ఫుడ్‌ను ఓ మతానికి ఆపాదించటం సరికాదు. ఇప్పుడివి ప్రపంచానికి ఎంతో అవసరం" అని చెప్పారు రామ్‌ దేవ్ బాబా. ఆయన సన్నిహితుడు, పతంజలి యోగపీఠ్ కోఫౌండర్ ఆచార్య బాలకృష్ణ 50వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో ఈ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలో యోగ్‌పీఠ్ ఎంతో మందికి మెరుగైన వైద్యం అందిస్తోందని, మొండి జబ్బులనూ నయం చేస్తోందని ప్రశంసించారు. "అలోపతి వైద్యులు టార్గెటెడ్ మెడిసిన్ తయారు చేస్తున్నారు. మెదడు, కాలేయం, కిడ్నీలు, గుండె,ఎముకలు...ఇలా అన్ని అవయవాలకు ప్రత్యేకంగా మందులు ఇస్తారు. కేవలం ఒకే ఒక మందుతో జబ్బుని ఎలా నయం చేస్తారు..? ఇలాంటి వాళ్లు అవివేకులు. ఆధునిక వైద్యం ఇంకా పసిప్రాయంలోనే ఉంది. వాళ్లు చేసిన పనులేవీ ఆమోదయోగ్యమైనవి కావు. ఒకే ఒక ప్రోటీన్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆరోగ్యంగా మార్చేస్తాం అనటం అవివేకం" అని అన్నారు రామ్ దేవ్ బాబా. 


సేంద్రియ వ్యవసాయం ఎంతో అవసరం..


ప్రపంచ వైద్య రంగం ఇప్పుడు శీర్షాసనం వేస్తోందని, టార్గెటెడ్ మెడిసిన్‌తో ప్రజల్ని అమాయకులుగా మార్చుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదో రెండు, మూడు జబ్బులకు తప్ప..యోగాలో అన్ని వ్యాధులకు మందు ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వచ్చే జబ్బులకూ యోగా విరుగుడు ఇవ్వగలదని చెప్పారు. భారత్ ఆరోగ్యంగా మారాలన్న లక్ష్యంతోనే పతంజలి పని చేస్తోందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రచారం మొదలు పెడతానని అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి టైప్-1 డయాబెటిస్ బాధితులు యోగ్‌పీఠ్‌కు వచ్చి వైద్యం తీసుకునే రోజులు త్వరలోనే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆ సమయం వచ్చినప్పుడు అలోపతి వైద్యులు చేసేందుకు సర్జరీలే  ఉండవని అన్నారు. త్వరలోనే లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ని తయారు చేస్తామని, 99% మేర  యోగా, ఆయుర్వేద, నేచురోపతితోనేసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. భారత్‌లో సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరాన్నీ గుర్తు చేశారు. భూసారాన్ని కాపాడుకోవాసలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. భూమిలో పోషకాల లోపం తలెత్తితే, మనుషుల్లోనూ ఆ లోపం కనిపిస్తుందని
వెల్లడించారు. ఫర్టిలైజర్ల పేరుతో విషం చల్లుతున్నామని, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. 


Also Read: Madhya Pradesh News: దారుణ ఘటన- బెయిల్‌పై విడుదలై అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్ రేప్!


Also Read: karimnagar Crime News : ప్రేమలన్నీ నిజం కావు - ఈ యువతి కష్టాలు చూస్తే అంగీకరించాల్సిందే !