Why are the riots not stopping in Bangladesh :  భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. అక్కడ రిజర్వేషన్ల వివాదంపై యువతలో తిరుగుబాటు వచ్చిందని దానికి సైన్యం కూడా మద్దతుగా ఉండటంతో ప్రజా తీర్పు ద్వారా ఎన్నికైన ప్రధాన  మంత్రి కూడా పారిపోవాల్సి వచ్చిందని అంతా అనుకున్నారు. అదే నిజమైతే ప్రధానమంత్రి పారిపోయిన వెంటనే.. దేశంలో విజయోత్సవాలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని  హాయిగా దేశంలో శాంతిభద్రతలు కాపాడుకోవాలి. కానీ అసలు సమస్య ప్రధాని షేక్ హసీనా కాదని.. దేశాన్ని అల్ల కల్లోలం చేయడమే అన్నట్లుగా అక్కడ అల్లర్లు సాగుతున్నాయి. పనిలో పనిగా ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులపై  జరుగుతున్న  దాడులు ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతున్నాయి. 


సమస్య షేక్  హసీనా కాదు.. ఇంకేదో! 


ప్రధానమంత్రిగా ఉన్న  షేక్  హసీనా దేశం నుంచి కట్టుబట్టలతో పారిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం సైన్యమే. విద్యార్థుల ఉద్యమానికి మద్దతివ్వడం.. ఆమెకు భద్రత లేకుండా చేయడం కారణంగా ఆమె దేశం విడిచివెళ్లిపోవాల్సి వచ్చింది. అంతటితో సమస్య పరిష్కారం కాలేదు. కానీ అప్పుడే పెరిగింది. ప్రధాని రాజీనామా చేసి పారిపోవడంతో ప్రభుత్వం లేకుండా పోయింది. ఫలితంగా అరాచక శక్తులు బరితెగించాయి. జరుగుతున్న హింసతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవర్ని ఎందుకు చంపుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో ఆందోళనకారులకే తెలియదు. కానీ దేశానికి మాత్రం.. పెట్టిన మంటలు ఆర్పకుండా పెడుతూనే ఉన్నారు. 


బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతకు కేంద్రం ప్రత్యేక కమిటీ - అమిత్ షా కీలక ప్రకటన


ఒకటి తర్వాత ఒకటి అనేక డిమాండ్లు..


ఉద్యమం పేరుతో యువత రోడ్ల మీదకు వచ్చింది. అందులో ఎవరి ప్లాన్ ఉందో.. ఎవరికీ తెలియదు. మొదట ప్రధాని షేక్ హసీనా పరారయ్యారు. దాంతో సంతృప్తి చెందలేదు. పార్లమెంట్ ను రద్దు చేయాలన్నారు. అలాగే చేశారు. తర్వాత తాత్కలిక ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో కూడా వారే డిమాండ్ చేశారు. వారి డిమాండ్ కు అనుగుణంగా నోబెల్ గ్రహీత్ మహమ్మద్ యూనస్ తో చీఫ్ అడ్వయిజర్ గా ప్రమాణం చేయించారు. మరి ఇప్పుడైనా అల్లర్లు తగ్గాలి కదా. తగ్గలేదు సరి కదా ఇంకా పెరుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ కూడా బతిమాలుకోవాల్సి వస్తుంది. ఆయన మాట కూడా వినడం లేదు.  తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని రాజీనామా చే్యాలని డిమాండ్ చేశారు. వారు కూడా రాజీనామా చేశారు. బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ గవర్నర్ నూ రాజీనామా చేయాలన్నారు. అలాగే చేశారు. దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ ఇలా వరుసగా డిమాండ్లతో రాజీనామాలు చేయిస్తున్నారు. 


విదేశీ శక్తులే బంగ్లాను అల్లకల్లోలం చేస్తున్నాయా ?


బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశం. ఎలాంటి విమర్శలు ఉన్నప్పటికీ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు పూర్తిగా ఎన్నికలతో సంబంధం లేని ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వం ఏర్పడింది. పార్లమెంట్ కూడా రద్దయిపోయింది. ఇప్పుడు ఎవరికీ బాధ్యత లేదు. కొత్త అడ్వయిజర్.. హింసను నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తోంది. అంటే బంగ్లాదేశ్‌లో పూర్తిగా పూర్తిగా అదుపుతప్పి పోయింది. విదేశీ శక్తుల అధీనంలో ఆందోళనకారులు ఉన్నారేమో కానీ వారు నిరంతరాయంగా బంగ్లాదేశ్ ను మండిస్తూనే ఉన్నారు. ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. నిజంగా ప్రధానిపై తిరుగుబాటు అయితే ఆమె పారిపోగానే సద్దుమణగాలి..కానీ అంతకు మించి ఏదో జరుగుతోందని  సులువుగానే అర్థమవుతోంది. 


బంగ్లాదేశ్‌లో హిందువులపై ఎందుకీ దాడులు? కోటి మంది బెంగాల్‌కి వలస వస్తున్నారా?


మైనార్టీలపై దాడులతో మరో పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ అవుతోందా ?


బంగ్లాదేశ్‌లో మైనార్టీలు హిందువులు. వారిపై నిరంతరాయగా దాడులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బంగ్లాదేశ్ కల్లోలిత ప్రాంతంగా మారిపోతుందని..మరో పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లా అవుతుందన్న ఆందోళన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. భారత్ పొరుగునే ఉండటం వల్ల భారత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది