ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై రష్యా మళ్లీ దాడులు ప్రారంభించింది.  నల్ల సముద్రంలోని రష్యా యుద్ధ నౌక మాస్క్వా విధ్వంసం ఉదంతం తర్వాత కీవ్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  దీంతో  యుద్ధం మరింత కాలం సాగబోతోందని ప్రపంచదేశాలు అంచనాకు వచ్చాయి. అసలు యుద్ధం ఎంత కాలం సాగుతుందో ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది.  ఉక్రెయిన్ ఎదురుదాడులకు దిగుతోందని రాష్యా ఆరోపిస్తూండటం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న అనుమానాలు ప్రారంభ కావడానికి కారణం అవుతోంది. 


వెనక్కి తగ్గినట్లు తగ్గి మళ్లీ దాడులకు దిగుతున్న రష్యా 


మార్చి నెలాఖరులో జరిగిన చర్చల్లో భాగంగా కీవ్‌, చెర్నిహీవ్‌ నుంచి సేనలను ఉపసంహరించుకుంటామని రష్యా చెప్పింది ఆ మేరకు ఉక్రెయిన్‌ ఉత్తరానికి  బలగాలను తరలించింది. ఆ తర్వాత దురాక్రమణను దక్షిణ, తూర్పు ప్రాంతాలకే పరిమితం చేసింది. అయితేరష్యా యుద్ధ నౌక మాస్క్వా విధ్వంసం జరగడంతో రష్యా మల్లీ దాడులు ప్రారంభించింది. క్యాలిబర్‌ మి సైల్స్‌తో.. కీవ్‌పై దాడులు చేసేందుకు సిద్ధమయింది. నల్ల సముద్రం నుంచి కీవ్‌ శివార్లలోని ఓ రక్షణ పరిశ్రమపై క్షిపణులతో దాడిచేసింది. ఈ పరిశ్రమలో యాంటీ-ట్యాంక్‌, యాంటీ-షిప్‌ క్షిపణులు తయారవుతా యి. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలైన సివెర్‌స్కీ, స్లోబోజెన్‌స్కీ, డోనెట్స్క్‌, లుహాన్స్క్‌, టవ్రిస్కీ నగరాల్లో పోరు ఉధృతంగా సాగుతోంది. ఇంతకాలం ఖెర్సోన్‌లో దాడులను నిలిపివేసిన రష్యా.. శుక్రవారం ఆ నగరంపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. నల్లసముద్ర తీర నగరాలు మైకొలైవ్‌, మారియుపోల్‌పైనా క్షిపణి దాడులు జరిగాయి.  


 






ఉక్రెయిన్ ఎదురుదాడులు చేస్తోందని చెబుతున్న రష్యా !


రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. యాబై రోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో గత రెండు రోజులుగా తమ భూభాగంలోని గ్రామాలపై ఉక్రెయిన్‌ దాడి చేస్తోందని రష్యా చెబుతోంది. రష్యా సరిహద్దు బ్రైయాన్‌స్క్ రీజియన్‌లోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ హెలికాప్టర్‌లు బాంబులు విడిచాయని రష్యా గురువారం ప్రకటించింది.  ఉక్రెయిన్ దాడుల్ని ఖండిస్తున్న ప్రకటించిన రష్యా.. తమ భూభాగంలో తీవ్రవాద దాడులు లేదంటే విధ్వంసానికి పాల్పడితే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై తమ మిసైళ్ల దాడుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది.   అయితే రష్యా చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని ఉక్రెయిన్ అంటోంది. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని  .. తమపై దాడులు చేయడానికి కారణంగా చూపిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. 



మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందంటున్న రష్యా !


 ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్నది మూడో ప్రపంచయుద్ధమేనంటూ రష్యా  సంచలన వ్యాఖ్యలు చేసింది.  పాశ్చాత్య, నాటో దేశాల అండతో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందుతున్నాయి. రష్యా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి  రష్యా  పోరాటం చేస్తోందని ప్రకటించారు.  ఐదు రోజుల్లో ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తామంటూ మొదట్లో ప్రకటన చేసిన రష్యా.. 50 రోజులైనా ముందుకు సాగలేకపోయిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతున్నారు. కొత్తగా రెండు దేశాల మధ్య యుద్ధం .. దాడులు మరోసారి ప్రారంభం కావడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ప్రపంచం మొత్తం ఏర్పడుతోంది.