Ukraine’s Deputy Foreign Minister: 'నిజమైన విశ్వగురు'గా నిరూపించుకోవాలంటే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని ఆ దేశ విదేశాంగ శాఖ స‌హాయ‌ మంత్రి భారత్‌ను కోరారు. భారతదేశం నిజంగా 'విశ్వగురువు' కావాలని కోరుకుంటే, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ మొట్టమొదటి విదేశాంగ శాఖ స‌హాయ‌ మంత్రి ఎమిన్ జాపరోవా (Emine Dzhaparova) కోరారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా జ‌పరోవా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కార్యదర్శి సంజయ్ వర్మతో సోమ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. మంగళవారం ఆమె విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, జాతీయ భ‌ద్ర‌తా ఉప స‌ల‌హాదారు (ఎన్‌ఎస్‌ఎ) విక్రమ్ మిస్రీతో భేటీకానున్నారు.


“ఎందరో ఋషులు, సాధువులు, గురువులకు జన్మనిచ్చిన భూమి - భారతదేశాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. నేడు, భారతదేశం విశ్వగురువు, ప్రపంచ గురువు కావాలని కోరుకుంటోంది. మా విషయంలో అమాయక బాధితుడి(ఉక్రెయిన్‌)పై దురాక్రమణదారు (ర‌ష్యా) దాడిపై మేము చాలా స్పష్టత‌తో ఉన్నాం. నిజమైన విశ్వగురుకు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం మాత్రమే సరైన ఎంపిక,” అని ఆమె భారత ప్రభుత్వంతో తన మొదటి అధికారిక స‌మావేశం సంద‌ర్భంగా తెలిపారు.


సంజ‌య్‌ వర్మతో ఆమె సమావేశం సందర్భంగా.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్‌ జెలెన్‌స్కీ ప్ర‌తిపాదించిన‌ 10-సూత్రాల‌ శాంతి ప్రణాళికతో పాటు ఉక్రెయిన్ ఆహార కార్యక్రమం - గ్రెయిన్ ఫ్రమ్ ఉక్రెయిన్‌లో భాగం కావాలని ఆమె భారతదేశాన్ని కోరారు. 2020 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ దేశానికి వ్య‌తిరేకంగా రష్యా చేప‌ట్టిన‌ చర్యల గురించి వివ‌రించారు. 


గతేడాది చివర్లో జెలెన్‌స్కీ 10-సూత్రాల‌ శాంతి ప్రణాళికను రూపొందించి, ప్ర‌పంచ దేశాల‌ ముఖ్య నాయకులందరికీ దాని గురించి వివ‌రించారు. 2020 నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G-20 సమ్మిట్‌లో ఆయ‌న‌ మొదటిసారిగా శాంతి ప్రణాళిక గురించి ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సంవత్సరం భారత అధ్యక్షతన జరగబోయే G-20 సమ్మిట్‌లో శాంతి ప్రణాళికను మరోసారి ప్ర‌స్తావించాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు భావిస్తున్నారు.


రష్యా ఇప్పటికే శాంతి ప్రణాళికను తిరస్కరించినప్పటికీ, జెలెన్‌స్కీ మాత్రం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సహా ప్రపంచ నాయకులకు దీనిపై విస్తృతంగా వివ‌రిస్తున్నారు. శాంతి ప్రణాళిక అణు కర్మాగారాల భద్రత, ర‌క్ష‌ణ‌కు సంబంధించి.. ముఖ్యంగా ప్ర‌స్తుతం రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియాలో ఉన్న అణు విద్యుత్ ప్లాంట్ విస్తృత ప్రణాళికను నిర్దేశిస్తుంది. 


ఐక్య‌రాజ్య‌స‌మితి చార్టర్‌కు కట్టుబడి ఉన్న రష్యాతో.. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం, రష్యాకు చెందిన అన్ని ర‌కాల బ‌ల‌గాల‌ను ఉపసంహరించుకోవడం, రష్యాతో ఉక్రెయిన్ సరిహద్దులను పునరుద్ధరించడం, ఇతర దేశాలకు ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతులకు భద్రత కల్పించడం గురించి కూడా శాంతి ప్ర‌ణాళిక వివ‌రిస్తుంది.


కాగా.. సంజ‌య్ వర్మతో సమావేశం అనంత‌రం ఎమిన్ జాపరోవా మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారతదేశం తన సైనిక‌, ఇంధన వనరుల బ‌లోపేతానికి కేవ‌లం మరియు ర‌ష్యాపై మాత్రమే ఆధారపడకూడ‌దని సూచించారు. లేకపోతే భార‌త్ అవ‌స‌రాన్ని రష్యా బ్లాక్‌మెయిల్ కోసం ఉపయోగిస్తుందని తెలిపారు.


"ఇంధన వనరుల బ‌లోపేతానికి, సైనిక సంబంధాలు మెరుగుప‌రుచుకోవ‌డానికి, పరస్పర రాజకీయ చర్యలను న‌వీక‌రించుకోవ‌డంలో భారతదేశం ఆచరణాత్మకంగా ఉండాలని నేను భావిస్తున్నాను ... అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం" ఉక్రెయిన్‌-భార‌త్‌ పరస్పరం క‌లిసి పనిచేయాల‌ని ఆమె ఆకాంక్షించారు.






ఉక్రెయిన్ తొలి విదేశాంగ శాఖ స‌హాయ‌ మంత్రి ఎమిన్ జాపరోవాకు ఘ‌న‌ స్వాగతం పలికామని, ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించామని భారత విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి సంజయ్ వర్మ ట్విట్టర్‌లో తెలిపారు. ఆమె పర్యటన విజయవంతం అవుతుందని ఆశాభావం వ్య‌క్తంచేశారు.






గత వారం ఆమె తన భార‌త‌ పర్యటనను ప్రకటించినప్పుడు, “భారతదేశం ఉక్రెయిన్‌తో స్నేహపూర్వక సంబంధాలతో పాటు బహుముఖ సహకారాన్ని పంచుకుంటుంది. దౌత్య సంబంధాలు ప్రారంభ‌మైన‌ గత 30 సంవత్సరాల్లో, రెండు దేశాల మధ్య  వాణిజ్యం, విద్య, సంస్కృతి, రంగాల్లో ద్వైపాక్షిక సహకారం గణనీయమైన పురోగతి సాధించింది. పరస్పర అవగాహన, ఆసక్తికి ఈ ప‌ర్య‌ట‌న కీల‌క‌ సందర్భం అవుతుంది.” అని భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ పేర్కొంది.