S. Iswaran Arrest: 



ఇద్దరు అరెస్ట్


భారత సంతతికి చెందిన సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్‌ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే..ఆయనను అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. జులై 11న ఆయనను అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మరో బిగ్‌షాట్‌నీ అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ విచారణలో ఏం తేలింది..? అసలు అధికారులు వాళ్లను ఏం ప్రశ్నించారు..? అన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారు. ప్రపంచంలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది సింగపూర్. అలాంటి దేశంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని తెలిస్తే దేశానికున్న పాపులారిటీ తగ్గిపోతుందేమో అన్న భయంతో అధికారులు అన్ని వివరాలు రహస్యంగానే ఉంచుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు సంపాదించే దాని కంటే...అక్కడి కేబినెట్ మంత్రులు సంపాదించేదే ఎక్కువ. అంత ఎక్కువ జీతాలు ఇవ్వడానికి ప్రధాన కారణం...డబ్బు కోసం మంత్రులు అవినీతికి పాల్పకూడదనే. అయినా...ఎస్ ఈశ్వరన్ అవినీతి చేయడంపై సింగపూర్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈశ్వరన్‌కి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 


ఇదీ కేసు..


మంత్రి ఎశ్ ఈశ్వరన్ (S Iswaran) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని లీ జీన్ లూంగ్‌ సెలవు పెట్టి పక్కకు తప్పుకోవాలని ఈశ్వరన్‌కి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. సింగపూర్ రవాణా మంత్రిగా ఉన్న ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసుని విచారించేందుకు. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానికి ఓ విజదజ్ఞప్తి చేసింది. మంత్రి ఈశ్వరన్‌ని విచారించేందుకు అనుమతినివ్వాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించారు ప్రధాని లూంగ్. విచారణకు అనుమతినిచ్చారు. ఈ కేసులో నిందితులెవరైనా సరే కచ్చితంగా విచారణ జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. అప్పటి వరకూ ఈశ్వరన్ లాంగ్‌ లీవ్ తీసుకోవాలని ఆదేశించారు. ఆయన స్థానంలో మరో మంత్రిని తాత్కాలికంగా రవాణా మంత్రిగా నియమించారు. భారీ అవినీతిలో మంత్రి హస్తం ఉండటంపై అసహనం వ్యక్తం చేసిన ప్రధాని లూంగ్...నిజానిజాలు త్వరలోనే బయట పడతాయని స్పష్టం చేశారు. CPIB పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని అన్నారు. 1997లో ఎస్ ఈశ్వరన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. సింగపూర్‌లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత 2006లో క్యాబినెట్‌లో చోటు దక్కింది. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సింగపూర్‌ని రీబిల్డ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే ఆయనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టింది. కొవిడ్ సంక్షోభం తరవాత సింగపూర్‌ని Air Hub గా మార్చడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు దాటింది. ఎప్పుడూ లేనిది ఈ సారి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


Also Read: PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడికి సతీమణికి తెలంగాణ చీరను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ