పోలాండ్, ఉక్రెయిన్ మధ్య ధాన్యం వివాదం మరింత ముందురుతోంది. యునైటెడ్ నేషన్స్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యలపై పొలాండ్‌ ప్రధాని మతౌజ్‌ మోరవియోకి ఆగ్రహం వ్యక్తం చేశారు. యుఎన్ ప్రసంగంలో చేసిన చేసిన కామెంట్స్ ను తప్పు పట్టిన మోరవియోకి, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం వివాదం ముదిరితే.. తాము భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయలేమని తేల్చిచెప్పింది. ఉక్రెయిన్‌ ఒలిగార్క్‌లు తమ ధాన్యాన్ని పోలాండ్ మార్కెట్‌, స్థానిక రైతుల పరిస్థితులను పట్టించుకోకుండా, తమ దేశంలోకి డంప్‌ చేస్తున్నారని ఆరోపించారు. 


ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పోలాండ్ ప్రధాని మోరవియోకి, జెలెన్ స్కీ వ్యాఖ్యలను పోలండ్ ప్రజలు ఎప్పటికీ అనుమతించరని అన్నారు.  పోలండ్ పేరు, దేశ గౌరవాన్ని కాపాడుకోవడం తన కర్తవ్యమన్న మోరవియోకి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న నేషనలిస్టు లా అండ్ జస్టిస్ పార్టీ నాయకుడిగా జెలెన్ స్కీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 15న పోలండ్ లో పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాలను తెరపైకి తీసుకురావద్దని సుతిమెత్తంగా హెచ్చరించారు. 


నల్లసముద్రంలోకి ఉక్రెయిన్‌ ధాన్యాన్ని రష్యా రానివ్వకపోవడంతో ఉక్రెయిన్, పొలాండ్ మధ్య విభేదాలకు కారణమైంది. జెలెన్‌స్కీ యుఎన్ లో పరుషంగా మాట్లాడటంపై పోలాండ్‌ కు ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఉక్రెయిన్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. ఉక్రెయిన్‌ ధాన్యం దిగుమతుల కోసం స్థానిక మార్కెట్‌ను అస్థిర పర్చలేమన్నారు యోరవియోకి.  తమ రవాణా మార్గాలను ఉపయోగించుకొని, ఎగుమతులు చేసుకోవడానికి ఎలాంటి అడ్డు చెప్పబోమన్నారు. అలాగని ఆ ఖర్చును తాము భరించబోమని, అవసరమైతే వాటి ద్వారా ఆదాయం సంపాదిస్తామని స్పష్టం చేశారు. 


ధాన్యం వివాదం ముదిరితే.. తాము భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయలేమని హెచ్చరించింది. ఓ వైపు ఉక్రెయిన్‌ రష్యాపై ఎదురుదాడులను మెల్లగా పెంచుతున్న సమయంలో పోలండ్‌ ప్రకటన జెలెన్ స్కీకి మింగుడు పడటం లేదు. చాలా దేశాలు భయపడుతున్న సమయంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా నిలిచింది పొలండ్. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడానికి మిగిలున్న అతి తక్కువ మార్గాల్లో పోలండ్‌ ఒకటి. నాటో నుంచి ఇక్కడికి తరలించిన ఆయుధాలను రైలు, రోడ్డు మార్గాల్లో ఉక్రెయిన్‌కు చేరుస్తున్నారు. దీంతోపాటు పోలండ్ కూడా సొంతంగా కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తోంది.


నల్లసముద్రం ధాన్యం డీల్‌ను రద్దు చేసుకొని, పుతిన్‌ విసిరిన పాచిక పారింది. ఇది ఉక్రెయిన్‌ మిత్రపక్షాల మధ్య బంధం బీటలు వారేలా చేసింది. వాస్తవానికి పుతిన్‌కు ఒకప్పటి సోవియట్‌లోని భాగమైన తూర్పు ఐరోపా దేశాల మార్కెట్లపై మంచి అవగాహన ఉంది. దీంతో ఉక్రెయిన్‌ ధాన్యాన్ని నల్లసముద్రం వైపు ఎక్కువగా రానీయకపోతే, అది భూమార్గంలో పోలండ్‌ సహా ఇతర దేశాల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా దేశాల స్థానిక రైతులు గగ్గోలు పెడతారు. అదే జరిగితే స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందన్నది పుతిన్‌ వ్యూహం. పొలాండ్, ఉక్రెయిన్ తాజా పరిణామాలు రష్యా మరింత కలిసి వచ్చేలా చేసింది.