ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరం మరియుపొల్ పూర్తిస్థాయిలో రష్యా వశమైనట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఆ ప్రాంతానికి నేడు విముక్తి లభించిందని పుతిన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ తెలిపింది.


లొంగిపోవాలి


మరియుపొల్‌లో ఉన్న అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌పై దాడి చేయడానికి బదులు, ముట్టడించాలని పుతిన్ తన సైన్యానికి సూచించారు. ఆ ప్లాంట్‌లో సుమారు 2 వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాడికి బదులు ముట్టడించేలా ఆదేలిచ్చారు. 


ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని, వారికి ఎటువంటి హాని తలపెట్టమని, వైద్య సాయం అందిస్తామని రష్యా చెప్పింది.


ఈగ కూడా


అంతకుముందు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు మాట్లాడుతూ, అజొవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరియుపోల్ నగరం రష్యా నియంత్రణలో ఉందని తెలిపింది. ఈ స్టీల్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు. ఈ పారిశ్రామిక వాడను దిగ్బంధనం చేయాలని, కనీసం ఈగ అయినా బయటికి వెళ్ళకుండా చూడాలని పుతిన్ ఆదేశించారు. 


ఈ స్టీల్‌ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోకపోతే మరియుపోల్‌ తమ నియంత్రణలో ఉందని చెప్పడం రష్యాకు సాధ్యం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం చాలా ఉంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి మరియుపోల్ నగరం అనేక నష్టాలను చవి చూసింది.


50 రోజులు 


ఉక్రెయిన్‌- రష్యా మధ్య యుద్ధం 50 రోజులు దాటింది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. రెండో దశలోకి యుద్ధం అడుగుపెట్టిందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఇటీవల అన్నారు. 


ఫిబ్రవరి నెలాఖర్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. అప్పటినుంచి ఎన్నో దఫాలుగా చర్చలు జరుపుతూనే మరోవైపు ఉక్రెయిన్‌లోని ముఖ్య నగరాలను హస్తగతం చేసుకునేందుకు బాంబుల వర్షం కురిపించింది రష్యా. అయితే యుద్ధం మొదలైనప్పటినుంచి ఈ నెలవ 17 వరకు రష్యా 2,002 సాయుధ వాహనాలు, 148 యూఏవీలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. 


ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ ద్వారా యుద్ధానికి సంబంధించి పలు వివరాలు షేర్ చేసుకున్నారు. తమ దేశంపై రష్యా యుద్ధం మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 17 వరకు దాదాపుగా 20,300 ఆర్మీ సిబ్బంది, 773 యుద్ధ ట్యాంకులు, 2002 సాయుధ వాహనాలు, 376 ఆర్టిలరీ సిస్టమ్స్, 127 రాకెంట్ లాంచర్స్, 66 యూనిట్ల వైమానిక దళ సామాగ్రి, 165 విమానాలు, 146 హెలికాప్టర్లు, 1,471 ఆటోమేటిక్ ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, ఓడలు, పడవలు కలిపి 8 వరకు  రష్యా నష్టపోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ బహిర్గతం చేశారు.


Also Read: Afghanistan Mosque Blast: అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు- 10 మంది మృతి


Also Read: UK PM Boris Johnson India Visit: తొలిసారి భారత్‌ వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్- చరఖా తిప్పిన జాన్సన్