Israel Heavily Strikes Beirut | హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు బీరుట్ దక్షిణ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. భారీ వైమానిక దాడులు లెబనీస్ రాజధానిలో కల్లోలం సృష్టించాయి. ఒకనొక దశలో ఈ వైమానికి దాడులతో దాదాపు 30 నిమిషాల పాటు ఎరుపు, తెలుపు మెరుపులు ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల వరకు కనిపించాయంటే దాడుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


హిజ్బుల్లా నేతల సమావేశం, బంకర్ పై బాంబుల వర్షం కురిపించిన సైన్యం


రాయిటర్స్ నివేదిక ప్రకారం, హిజ్బుల్లా చీఫ్‌ హసన్ నస్రల్లా అనంతరం అతడి వారసుడుగా భావించే హిజ్బుల్లా కార్వనిర్వహక మండలి చీఫ్ హషీమ్ సఫీద్దీన్ జాడ కనిపించడం లేదు. బీరూట్ లోని దాహియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి సఫీద్దీన్ లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు శుక్రవారం ప్రకటనలు వచ్చాయి. హిజ్బుల్లా నేతలతో ఓ బంకర్ లో హషీమ్ సఫీద్దీన్ సమావేశం అయ్యాడన్న సమాచారంతో గగనతలం నుంచి బాంబు దాడులతో ఇజ్రాయెల్ సేనలు వణికించాయి. అప్పటి నుంచి సఫీద్దీన్ నుంచి తమకు సంబందాలు తెగిపోయాయని హిజ్బుల్లా వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ సేనలు దాహియాలో జరిపైన వైమానిక దాడుల్లో సఫీద్దీన్ సైతం మృతిచెంది ఉంటాడని, శిథిలాల కింద డెడ్ బాడీ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయకచర్యలు చేపట్టేందుకు వీలు కుదరకపోవడంతో సఫీద్దీన్ జాడ కనిపెట్టలేకపోతున్నారు. ఇజ్రాయెల్ దాడులను ఆపేలా చేయాలని పలు దేశాలను హిజ్బుల్లాతో పాటు లెబనాన్ ప్రభుత్వం కోరుతున్నాయి.


నివాసితులు పారిపోవాలని బీరూట్, దాహియా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో తమ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. ముఖ్యంగా బెకా వ్యాలీతో పాటు బీరుట్‌తో సహా దేశంలోని దక్షిణాన ఉన్న ప్రాంతాలు, తరువాత ఉత్తరాన ఉన్న ట్రిపోలీ లక్ష్యంగా చేసుకుని దాడులకు వ్యూహ రచన చేసినట్లు సమాచారం. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివపకూ దాదాపు 400 మందికి పైగా హిజ్బుల్లా సైన్యాన్ని హతమార్చాయని ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది. 


Also Read: Israel: మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు? 


ఇజ్రాయెల్ ఆర్మీ కీలక ప్రకటన


ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ, తమ దాడులు ప్రారంభించినప్పటి నుంచి జరిపిన దాడుల్లో దాదాపు 440 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో 30 మంది వివిధ స్థాయి కమాండర్లు (హిజ్బుల్లా) ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం సెప్టెంబరు 27న లెబనాన్ రాజధాని బీరూట్‌లోని గ్రూప్ సెంట్రల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిపిన దాడిలో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతమయ్యాడని తెలిపారు. హిజ్బుల్లా నస్రల్లా మృతి చెందాడని ప్రకటించింది. కానీ సెకండ్ చీఫ్ సఫీద్దీన్‌ ఆచూకీపైగానీ, లేక మరణంపైగానీ ఏ వ్యాఖ్యలు చేయలేదు.


ఇజ్రాయెల్ దాడిలో వందలాది లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 1.2 మిలియన్ల మంది ప్రజలు శరణార్థులుగా మారిపోయారు. దాదాపు నాలుగింట ఒక వంతు మంది వారి ఇళ్లను వదిలి ప్రాణభయంతో వేరే చోటుకు వెళ్లినట్లు పలు సంస్థలు చెబుతున్నాయి. 


ఇజ్రాయెల్ హమాస్ దాడికి ఏడాది పూర్తి


గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, మరో దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఇది ఏడాది ఏడాది కావొస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రతీకారం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నెతన్యాహు ఆదేశాలను సైన్యం తూ.చ తప్పకుండా పాటిస్తూ లెబనాన్, హిజ్బుల్లా సంస్థపై దాడులు ముమ్మరం చేశాయి. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 42,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. దాదాపు 2.3 మిలియన్ల జనాభా శరణార్థులుగా మారి వేరే చోటుకు వెళ్లిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.