Chinese Man With Ovaries: జంబలకిడిపంబ సినిమా చూశారా? అందులో పురుషులంతా.. మహిళలుగా మారిపోయి ఇంటి పనులు, వంటపనులు చేస్తుంటారు. మహిళలేమో పురుషులు చేసే పనులు చేస్తుంటారు. మంచి కామెడీగా ఉండే ఆ సినిమాయే నిజజీవితంగా మారిపోతే? పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా? అవును చైనాలో తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే బయటపడింది.






ఇదీ జరిగింది


చైనాలో ఓ పురుషుడికి (33) గత 20 ఏళ్లుగా రుతుక్రమం అవుతోంది. అయితే దీన్ని అతను లైట్‌గా తీసుకున్నాడు. కానీ ఓ రోజు మూత్రంలో ర‌క్తం, తీవ్ర‌మైన క‌డుపునొప్పి రావ‌డంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స అందించిన వైద్యులు అతడికి షాకింగ్‌ వార్త చెప్పారు.


అత‌డికి గ‌ర్భాశ‌యం ఉందని, అండాలు విడుద‌ల‌వుతున్నట్లు తెలిపారు. జీవ‌శాస్త్ర‌ప‌రంగా అత‌డు మ‌హిళ అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా అతడు అవాక్కయ్యాడు. 


20 ఏళ్లుగా 


గత 20 ఏళ్ల నుంచి అతని మూత్రంలో రక్తం వస్తూనే ఉంది. అయితే యుక్తవయస్సులో ఉన్న‌ప్పుడు మూత్రవిసర్జన స‌మ‌స్య ఉండ‌డంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అత‌డికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వ‌స్తున్న‌ది. ఇటీవ‌ల క‌డుపునొప్పి నాలుగు గంట‌ల‌కుపైగా కొన‌సాగ‌డంతో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాడు. వైద్యుడు అతనికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. అనతరం ఆపరేషన్‌ చేసినప్పటికీ కడుపు నొప్పి తగ్గలేదు. 


స్కానింగ్‌లో


కడుపునొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో బాధితుడికి స్కానింగ్‌ తీశారు వైద్యులు. దీంతో అసలు విషయం బయటపడింది. అత‌నికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు.


అందులోనూ ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో హార్మోన్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. చివరకు రుతుక్ర‌మం వ‌ల్లే ఇలా మూత్రంలో రక్తం వస్తుందని తేల్చారు.


ఆపరేషన్


దీంతో ఆ వ్యక్తికి ఆపరేషన్ చేశారు వైద్యులు. తనకున్న స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించే శస్త్రచికిత్సను గత నెలలో చేశారు. అది విజయవంతం అయింది. అయితే అతను ఎప్పటికీ తండ్రి అయ్యే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ఎందుకంటే అతని టెస్టికల్స్ స్పెర్మ్ (వీర్య కణాలు)ను ప్రొడ్యూస్ చేయలేవని నిర్ధారించారు.


Also Read: Amarnath Flash Floods: అమర్‌నాథ్ వరదల్లో 16కు చేరిన మృతుల సంఖ్య- రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 18,257 మందికి కరోనా- ఎంత మంది మృతి చెందారంటే?