Kabul Blast: అఫ్గానిస్థాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. పవిత్ర రంజాన్ మాసం వేళ మసీదుల్లోను బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. రాజధాని కాబూల్‌లో జరిగిన బాంబు పేలుడులో 50 మంది వరకు మృతి చెందినట్లు మసీదు వర్గాలు తెలిపాయి.


రంజాన్ వేళ


రంజాన్ మాసం కావడంతో ప్రార్థనల కోసం పెద్ద ఎత్తున ప్రజలు మసీదుకు వచ్చారు. దీంతో దుండగులు పక్కా పథకం ప్రకారం పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. కాబూల్‌లోని ఖలిఫా సాహెబ్ మసీదులో ఈ బాంబు దాడి జరిగింది. అయితే ఈ పేలుడులో 10 మందే మృతి చెందినట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. కానీ 50 మంది వరకు మృతి చెందినట్లు మసీదు వర్గాలు చెబుతున్నాయి.


వరుస పేలుళ్లు


ఉత్తర అఫ్గానిస్థాన్​లో గురువారం జరిగిన రెండు బాంబు దాడుల్లో 9 మంది మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు పేలుళ్లు జరిగాయి.


బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని దుండగులు పేలుళ్లు జరిపారని అధికారులు తెలిపారు. ఈ బాంబు దాడులకు పాల్పడింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. 


తాలిబన్ల పాలన


అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణయాలు అఫ్గాన్‌ను మరింత దిగజారేలా చేస్తున్నాయి. బాలికలు హైస్కూల్​ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు. 


ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు.  బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.


20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్‌కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్‌ను వదిలి వెళ్లాయి. అప్గాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందాయి.


Also Read: SpaceX: దుమ్ము రేపుతోన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్- మూడు వారాల్లో రెండు సార్లు అంతరిక్షానికి!


Also Read: Sri Lanka Economic Crisis: శ్రీలంకలో సంచలనం- ప్రధానిని తొలగించి, మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే!