What is Transhumanism: 


మనందరం సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమా చూశాం కదా. అంతకు ముందు వచ్చిన రోబో కి సీక్వెల్ ఇది. అంటే రోబో సినిమాలో చూపించిన రోబో కంటే 2.0 లో చూపించిన రోబో చాలా పవర్ ఫుల్ అండ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అన్నమాట. అలాగే మనిషి కంటే నెక్ట్స్ జనరేషన్ ఏంటీ అనే చర్చ మొదలైంది. మనిషికి నెక్ట్స్ జనరేషన్ అంటే ఏముంది నా పిల్లలు, నా మనవళ్లు, మనవరాళ్లు...ఓకే ఓకే.. 
నేనడుగుతోంది..ఇప్పుడున్న ఆధునిక మానవుడికి తర్వాతి దశ ఏంటీ అని. అర్థం కాలేదా ఇంకా వివరంగా మాట్లాడుకుందాం.


హోమోసేపియన్స్ హవా :


డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి జీవిత పరిణామ క్రమం గ్రేట్ ఏప్స్ అని పిలుచుకునే పెద్దకోతుల నుంచి మొదలైంది అంటారు. ఆ తర్వాత ఎవల్యూషన్ థియరీ లో భాగంగా నాలుగు కాళ్ల మీద నడిచే ఆ పెద్ద కోతులు రెండు కాళ్ల మీద నడవటం నేర్చుకోవటం, వెన్ను నిటారుగా నిలబడేందుకు సహకరించటంతో ఇప్పుడు చూస్తున్న మనిషి ఉద్భవించాడు. ఇదంతా ఇలా చిటికెలో జరిగిపోలేదు. ఈ మార్పులన్నీ కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరిగాయి. ఇప్పుడున్న చూస్తున్న హోమో సెపియన్స్ అంటే ఆధునిక మానవులైన  మన కంటే ముందు బతికిన నియాండర్తల్ అనే మానవ ప్రజాతిని మన హోమో సెపియన్స్ అంతమొందించారనే థియరీలు కూడా ఉన్నాయి. నాలుగు లక్షల సంవత్సరాలు ముందు ఆఖరుగా నియాండర్తల్స్ ఈ భూమిపై తిరిగిన ఆధారాలు లభించాయి.  మన కంటే ఎత్తైన, దృఢమైన నియాండర్తల్స్ ను ఇప్పుడున్న హోమోసెపియన్స్ అనే మనం ఎలా ఎదుర్కొన్నామో తెలియదు కానీ కేవలం తెలివి తేటలే కారణం అని అంటారు. సేపియన్స్ అంటే అర్థం తెలివైన వారనే.


తర్వాతి తరం ట్రాన్స్ హ్యూమనిజం :


సరే ఇప్పుడు అసలు కథకు వద్దాం. ఎలా అయితే నియాండర్తల్స్ ను దాటుకుని హోమోసెపియన్స్ అనే మనం..... తర్వాతి తరంగా ఉద్భవించామో..ఇప్పుడు అలానే హోమోసెపియన్స్ కు నెక్ట్స్ రూపం ఏంటనే  చర్చ విజ్ఞానశాస్త్ర ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిన పేరే ట్రాన్స్ హ్యూమనిజం.  అంటే ఏం లేదు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాంకేతికత, టెక్నాలజీ ఉపయోగించుకుని మనిషి ప్రకృతి పరంగా పొందిన శక్తులను మరింత రెట్టింపు చేసుకోవటం, ప్రకృతి సహజ నియమాలైన చావు, పుట్టుక లాంటివి జయించి అనంతమైన శక్తిగా తయారవటం లాంటివే ట్రాన్స్ హ్యూమనిజం లో ప్రధానమైనవి.


కృత్రిమ మేథతో సాధ్యం :


అదేంటి పుట్టుక, చావు లాంటివి మన చేతుల్లో లేవు కదా అంటారా. ఎస్ అవును. కానీ హ్యూమన్ రేస్ తన పరిణామ క్రమంలో భవిష్యత్తులో అసలు చావు పుట్టుకలకు కారణాలను అన్వేషించగలదనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లో ఉంది. ఉదాహరణకు ఇది వరకూ పుట్టుకతో వైకల్యం ఉంటే ఇక జీవితాంతం అలానే గడపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ లింబ్స్ అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ కాళ్లు, చేతులతో అసలు అవి లేవనే భావన నుంచి దూరం అవటంతో పాటు అందరిలానే వాళ్లు గడుపగలుగుతున్నారు. న్యూరాన్స్ డిసీజ్ తో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ చక్రాల కుర్చీకే జీవితాంతం పరిమితమైనా ఆయన ఎన్నో పుస్తకాలు రాయగలిగారు..ఎన్నో పరిశోధనలు చేయగలిగారు అంటే కారణం...ఆయనకు సహాయంగా నిలిచిన టెక్నాలజీనే. ఆయన మనసులో ఉన్న ఆలోచనలను పేపర్ మీద పెట్టగలిగే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతోనే స్టీఫెన్స్ హాకిన్స్ బ్లాక్ హోల్స్ మీదా పరిశోధనలు చేయగలిగారు.


మనదే ఆఖరి తరం:


ఇదంతా ఎలా వర్కవుట్ అయ్యిందో అలానే తన ఫిజికల్, మెంటల్ లిమిటేషన్స్ ను మనిషి జయించగలగడని...అలా జయించిన మనిషే ఇప్పటి ఆధునిక మానవుడికి తర్వాతి తరం వాడవుతాడని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ట్రాన్స్ హ్యూమనిజం అని పిలుస్తున్నారు. మానవ శరీరంలోని వివిధ భాగాలకు ఏర్పడుతున్న, ఏర్పడబోయే ఇబ్బందులను ముందుగానే గ్రహించటం ద్వారా ఆ ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కోగలగటం, వయస్సును తగ్గించుకునే, ప్రకృతి నియమాలను రివర్స్ చేసుకునే ఈ టెక్నాలజీలపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ దశను దాటి మనిషి మరింత ముందుకు వెళ్తే..ఈ భూమి ట్రాన్స్ హ్యూమనిస్టుల వశం అవుతుంది. ఈ భూమిపై ప్రకృతి నియమాలను అనుసరించి బతికిన ఆఖరి తరంగా మనమే చరిత్రలో నిలిచిపోతాం.. కలిసిపోతాం. 


Also Read: Sri Lanka Crisis: శ్రీలంకా కాస్త ఊపిరి పీల్చుకో, అప్పు ఇచ్చేందుకు ఓకే చెప్పిన IMF