తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్ర వరకు రికార్డు స్థాయిలో ఎండలు మండిపోనున్నాయి. సాయంత్రానికి వెదర్‌ని కూల్ చేసేలా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. మొత్తానికి ప్రీమాన్‌సూన్ కారణంగా ఇలాంటి డిఫరెంట్ వెదర్ కనిపించనుంది. మరోవైపు రుతుపవనాలు జూన్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉందని ఏపీ వెదర్‌ మ్యాన్ సాయి ప్రణీత్ చెప్పారు. 


తెలంగాణలో వారం రోజుల పాటు వేడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా వివరించింది. పగట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీలకుపైగా నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. అందుకే రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజులపాటు ఈ అలర్ట్‌ ఉంటుందని ప్రకటించింది. 


ఆదివారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 44.6గా రిజిస్టర్ అయింది. అతి తక్కువ ఉష్ణోగ్రత 22.6 హయత్‌నగర్‌లో నమోదు అయింది. ఉష్ణోగ్రతతో బెంబేలెత్తిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపలతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 


దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ చత్తీస్ గఢ్, పరిసరాల్లోని తెలంగాణ మీద ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఏర్పడింది. దీని వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ సహా చుట్టు పక్కల 2, 3 జిల్లాలలో 39 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు అంచనా వేశారు. వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజాబాద్‌, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట్‌, గద్వాల్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. 


హైదరాబాద్ లో ఇలా
ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. 


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.


రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.


రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 268 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. 


ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌ మ్యాన్‌ సాయిప్రణీత్‌ రిపోర్ట్‌ ఇలా ఉంది...
ఏపీ, తెలంగాణలో మేఘావృతంతో నిండిన ఆకాశాలు కనిపిస్తాయి. తెలంగాణలో దక్షిణ భాగం నుంచి ఏపీలోని తూర్పు జిల్లాల వరకు ఆకాశం ఇలానే ఉంటుంది. బంగాళాఖాతంలో బర్మాకు ఆనుకొని అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. అరేబియాలో ఉపరితల ద్రోణి ఏర్పడి ఇవాళ రేపు అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది. రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. 
జూన్ మూడో వారం వరకు రుతపవనాలు వచ్చే అవకాశం లేదు. ప్రీమాన్‌సూన్ సీజన్‌ ప్రస్తుతానికి కొనసాగుతోంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడబోతున్నాయి. వర్షాలు పడే ఛాన్స్ ఉన్న ప్రాంతాలు- శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లా, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉంటుంది. సాయంత్రానికి వర్షాలు పడతాయి. 


సీమ జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్- అనంతపురం జిల్లాలోని పశ్చిమప్రాంతాలు, సత్యసాయి జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. కర్నూలు జిల్లా, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలో కూడా వర్షాలు పడతాయి. సముద్రంలో తేమ గాలులు భూభాగంపైకి రావడంతో నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఆ తేమ ఇప్పుడు సీమ జిల్లాలపైకి వెళ్లింది. అందుకే వర్షాలు పడే అవకాశం ఉంది. 


పదిరోజుల వాతావరణం చూస్తే.. సీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది. ఉత్తరాంధ్ర అక్కడక్కడ వర్షాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడాతాయి. 


రుతుపవనాలు 17,18 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. 21 నాటికి మొత్తం తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు విస్తరించ వచ్చని వెదర్ మ్యాన్ చెప్పారు. ఈ జూన్‌లో చివరి రెండు వారాలు సాధారణం కంటే తక్కువ వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం, జులైలో వర్షాలు ఫర్వాలేదనిపించినా... ఆగస్టు, సెప్టెంబర్‌లో మాత్రం వర్షపాతం లోటు కనిపించనుంది. ఎల్‌నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా ఉందన్నారు.