Weather Latest Update: ఇన్నిరోజులు ఉక్కపోతతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభించింది. శుక్రవారం నుంచి చాలా ప్రాంతాల్లో మోస్తలు వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మోస్తలు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. 


జులైలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టాయి. జులై నెల ఆఖరు నుంచి ఇప్పటి వరకు రుతుపవనాల విరామంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కాలంలో ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరుందుకున్నాయి. 


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు కంటిన్యూ అవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను తాకుతూ ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌వైపు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. 


అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో చాలా జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీమ్‌- ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఇప్పటి వరకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చెదురుమదులు వర్షాలు కురుస్తున్నాయి. 


హైదరాబాద్‌లో వెదర్


హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఉంటుంది. గరిష్ణ ఉష్ణోగ్రత- 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత- 22 డిగ్రీలుగా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. నమోదైన గరిష్ణ ఉష్ణోగ్రత-28.8 డిగ్రీలు, కనిష్ణ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలు 


తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న వేళ అధికారయంత్రాంగాన్ని సీఎస్ శాంతికుమారి అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో శుక్రవారం మాట్లాడిన ఆమె... కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలపై దృష్టి పెట్టాలన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు మూడు రోజులు వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనిస్తోందని దాని ప్రభావం ఏపీలో ఉంటుందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్లవ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వివరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నట్టు వెల్లడించింది. 


సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఈటైంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరెంజ్‌ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు- అల్లూరి సీతారామరాజు జిల్లా , పార్వతీపురం మన్యం జిల్లా
ఎల్లో అలర్ట్‌ జారీ అయిన జిల్లాలు- అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు నెల్లూరు, బాపట్ల, పల్నాడు ,గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు


దేశంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సతం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వేల మంది మృత్యువాత పడ్డారు. కేంద్రం చెప్పిన వివరాలు పరిశీలిస్తే జూన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షల హెక్టార్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 90 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 60 వేల జంతువులు కూడా చనిపోయాయి.