Vote Form Home :   కర్ణాటక ఎన్నికల్లో ఎన్నికల సంఘం తొలి సారి ఓ విప్లవాత్మక మార్పును ప్రవేశ పెట్టింది. అదే ఓట్ ఫ్రం హోం. అంటే ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడం. ఈ అవకాశం 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు కల్పిస్తారు. అయితే ఈ ఓటు ఫ్రం హోం అంటే ఏమిటి ... ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై చాలా సందేహాలు ఉన్నాయి. వాటికి ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఓటు ఫ్రం హోంను వినియోగించుకోవడానికి ఈసీ పక్కా విధానాలను ఏర్పాటు చేసింది. అంతా  అంతా పారదర్శకతతో ఉంటుందని.. ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని చెబుతోంది. 


ఓటు ఫ్రం హోంకు పోలింగ్‌కు ముందు  దరఖాస్తు చేసుకోవాలి ! 


పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  80 ఏళ్లు పైబడిన వారు.. దివ్యాంగులు పోలింగ్ కు ఐదు రోజుల ముందే ఫారం 12 D కోసం దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం వేగంగా పరిశీలనచేస్తుంది.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం బృందాలు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? కాదా..? అనేది సరి చూసుకుంటారు. అర్హులు అని నిర్థారించుకున్న తర్వాతే.. పోలింగ్ జరిగే రోజు ఫారం 12D తీసుకుని.. ఎన్నికల సిబ్బంది వారి ఇంటికే వెళ్తారు. బ్యాలెట్ పేపర్ వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు.


అచ్చం పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు 


ఓటు వేసే సమయంలో పక్కన ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో సైతం తీస్తారు. ఓటు ఎవరికి వేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. పోలింగ్ బూత్ లో ఎలాంటి ప్రక్రియ అయితే జరుగుతుందో.. అదే తరహాలోనూ ఇంట్లోనే వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని ఎన్నికల సంఘం చెబుతోంది.  ఇంటి నుంచి ఎవరెవరు ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఎంత మందికి ఓటు హక్కు కల్పించామనేది వంటి ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారం ఇస్తారు.  


ఇక అన్ని ఎన్నికల్లోనూ ఇదే అవకాశం కల్పించే చాన్స్!


ఈ ఓటు  ఫ్రం హోం కర్ణాటకలో ఎలా అమలవుతుందన్నదాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి ఇక అన్ని రకాల ఎన్నికల్లో ఈసీ అమలు చేసే అవకాశం ఉంది. నిజానికి కోవిడ్ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇలాంటి అవకాశాలను కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వృద్ధులు ఎక్కువగా ఓటు వేయకుండా ఉంటారని.. అందువల్ల ఓటింగ్ శాతం తగ్గుతోందని... ఎన్నికల సంఘం తీసుకు వచ్చిన తాజా సౌకర్యం వల్ల ఓటింగ్ శాతం మరింతగా పెరుగుతుదంని అంచనా వేస్తున్నారు.   కర్నాటక లో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 12 లక్షల 15 వేల మంది ఉండగా.. 5 లక్షల 55 వేల మంది దివ్యాంగులు ఉన్నారు.