మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఎదుగుతున్న మహిళలు.. స్వతంత్ర పోరాటంలో కదనరంగంలో కత్తి దూసిన ఝాన్సీ లక్ష్మీబాయి సాక్షిగా అన్ని రంగాలలో రాణిస్తున్న ఆడబిడ్డలు. అంతరిక్షంలోకి ఎగిరి యావత్ ప్రపంచానికి సవాల్ విసిరిన సునీతా విలియమ్స్ లాగా అవకాశాలను అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా తమ కలలను సాకారం చేసుకుంటున్న అబలలు. ఇవన్నీ మహిళా సాధికారిత నాణానికి ఒకవైపు మాత్రమే మరోవైపు అనేక కుగ్రామాలలో కట్టుబాట్ల నడుమ మహిళాలోకం కునారిల్లుతోంది.


పల్లెల్లో ఇంకా దుచారాలు


ఆడపిల్లలకు ఉన్నత విద్య నిరాకరణ, బాల్య వివాహాలు, దేవదాసి, జోగిని వ్యవస్థ లాంటి ఎన్నో సాంఘిక దురాచారాలు ఇప్పటికీ జీవితాలను చిదిమేస్తున్నాయి. అయితే ఇలాంటి దురాచారాలపై ప్రత్యేక చట్టాలు ఉండడం, ఎన్జిఓల ఆధ్వర్యంలో వీటిపై ప్రత్యేక నిఘా ఉండటంతో కాలానుగుణంగా కొంత తగ్గాయని చెప్పవచ్చు. కానీ వెలుగులోకి రాని మరిన్ని దురాచారాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల‌్లో కనిపిస్తూనే ఉన్నాయి.


నెలసరిలో గ్రామబహిష్కరణ


అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గొల్లల హట్టిలు అలాంటివే. బాలింతలను, రుతుక్రమంలో ఉన్న బాలికలు, మహిళలు ఊళ్లో ఉండడానికి వీలు లేదన్నది అక్కడి కట్టుబాటు. నెలసరి సమయంలో బాలికలు, యువతులు, స్త్రీలు ఊరి వెలుపలకు వెళ్లి ప్రత్యేకమైన గదిలో ఉండాలి. అక్కడే వంటావార్పు చేసుకోవాల్సి ఉంటుంది.


పాటించకుంటే అరిష్టమట


ఆ మూడు రోజులు పూర్తైన తర్వాత అక్కడే స్నానం చేసి ఊరిలో రావాలి. గొల్లలహట్టిలో ఉన్న విద్యావంతులు ఈ దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ పెద్దల ఒత్తిడితో ఆచారాన్ని పాటించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇది తమ సంప్రదాయమని దీనిని పాటించకపోతే అరిష్టాలు జరుగుతాయని పాతతరం మహిళలు చెబుతున్నారు.


ఆ మూడు రోజులు పట్టణాలకు


విద్యావంతులు అయిన యువతులు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పురుషులందరూ ప్రత్యేకంగా చూస్తుంటారని, అవమాన భారంతో తల ఎత్తుకోలేని పరిస్థితులు నెలకొంటాయంటున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ దురాచారాన్ని బహిష్కరించాలని కోరుతున్నారు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఆచారం కొంత తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు. నేటి తరం యువత నెలసరి టైంలో సమీప పట్టణాల‌్లో ఉంటూ ఈ గ్రామబహిష్కరణ నుంచి తప్పించుకుంటున్నారు. 


ఎన్జీవోలు , ప్రజాసంఘాలు, ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా పోలీసు శాఖ బాసటగా నిలిస్తే ఈ సాంఘిక దురాచారం నుంచి బయటపడేందుకు ఆస్కారం ఉంటుందని ఆయా గ్రామాల్లోని యువతులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.