ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరమైంది. ఈ ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా 141 దేశాలు ఓటేశాయి. 5 దేశాలు ఓటింగ్‌ను వ్యతిరేకించాయి. భారత్, చైనా, పాక్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

భారత్ శాంతిమంత్రం

రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ ముందు నుంచి శాంతిమంత్రమే జపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది.

రష్యా- ఉక్రయిన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనగా ఉంది. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలకు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలి. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించాలి.                                                 "
- భారత్

రష్యాతో బలమైన మైత్రి ఉన్నందునే ఓటు వేసేందుకు భారత్ దూరంగా ఉంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్​కూ భారత్ దూరంగానే ఉంది.

సాయం కోరిన ఉక్రెయిన్

మరోవైపు ఉక్రెయిన్ మాత్రం.. ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత్.. ఉక్రెయిన్‌కు మద్దతు పలకాలని కోరింది. భారత్‌కు ఐరాసలో ప్రాబల్యం ఉందని.. కనుక న్యాయం వైపే మోదీ సర్కార్ నిలవాలని అభ్యర్థించింది. అలానే ఖార్కివ్‌లో భారత విద్యార్థి నవీన్ మృతికి ఉక్రెయిన్ సంతాపం వ్యక్తం చేసింది. రష్యా షెల్లింగ్‌ కారణంగానే భారత విద్యార్థి మృతి చెందాడని తెలిపింది.

నవీన్ మృతిపై రష్యా కూడా స్పందించింది. భారత విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తామని రష్యా రాయబారి అన్నారు. నవీన్ మృతిపై రష్యా తరఫున సంతాపం వ్యక్తం చేశారు. యుద్ధం జరుగుతోన్న సమయంలో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Russia Ukraine War: నేను చెప్తే పుతిన్ యుద్ధం ఆపేస్తారా?: సీజేఐ ఎన్‌వీ రమణ