ఇంత నిర్లక్ష్యమైతే ఎలా..? : అధికారులు


ఓ పారిశుద్ధ్య కార్మికుడు తన డ్యూటీ తాను కరెక్ట్‌గా చేసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. యూపీలో జరిగిందీ ఘటన. మధురలోని గెనెరల్‌గంజ్‌లో చెత్తను సేకరించే కార్మికుడికి, చెత్త కుండీలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కనిపించాయి. తన డ్యూటీ ప్రకారం ఆ రెండు ఫోటోలను కూడా బండిలో వేసుకుని వెళ్లిపోయాడు. ఇది చూసిన స్థానికులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే, వివాదమైంది. అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తావంటూ అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు అధికారులు. "ఇలా ఎందుకు చేశావ్" అని ఆ కార్మికుడిని అధికారులు ప్రశ్నించారు. "అవి రోడ్డుపైన పారేసి ఉన్నాయి. నా డ్యూటీ నేను చేశానంతే" అని సమాధానమిచ్చాడు. గార్బేజ్ కార్ట్‌లోని రెండు ఫోటోలను చూసిన వెంటనే స్థానికులు వాటిని బయటకు తీశారు. మరో ఫోటో కూడా అడుగున ఉండిపోయిందని చెప్పారు. ఓ వ్యక్తి కార్‌లో నుంచి దిగి ఈ ఫోటోలను తీసుకుని శుభ్రం చేసి తీసుకెళ్లిపోయినట్టు కొన్ని వీడియోలూ సోషల్ మీడియాలోకనిపించాయి.






"బాబీ అనే ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా, వెంటనే అతడిని విధుల్లో నుంచి తొలగిస్తున్నాం" అని అడిషనల్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. "ఆ ఫోటోలు రోడ్డుపైన పడి ఉంటే అది నా తప్పు కాదు కదా" అని వాదిస్తున్నాడు ఆ కార్మికుడు. "నన్ను ఉద్యోగంలో నుంచి తీసే ముందు అసలేం జరిగింది అని విచారించాలి. అది నిజంగా నా తప్పేనా అని ఆలోచించాలి. అప్పుడు నిర్ణయం తీసుకోవాలి" అని అని అసహనం వ్యక్తం చేశాడు.