Uttar Pradesh: ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!

ABP Desam   |  Murali Krishna   |  11 Sep 2022 10:51 AM (IST)

Uttar Pradesh: ఓ భక్తుడు తన నాలుక కోసుకొని దేవతకు సమర్పించిన ఘటన కలకలం రేపుతోంది.

ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!

Uttar Pradesh: కోరిన కోరికలు నెరవేర్చినందుకు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది కాలినడకన నడిచి కొండెక్కి దేవుడి దర్శనం చేసుకుంటారు. మరికొంతమంది ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెడుతుంటారు. అయితే ఓ భక్తుడు చేసిన పని మాత్రం కలకలం రేపుతోంది. నాలుక కోసుకొని దేవతకు సమర్పించాడు ఓ వ్యక్తి.

ఇదీ జరిగింది

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కడధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శీతలా మాత గుడిని సందర్శించడానికి వచ్చిన ఓ భక్తుడు తన నాలుకను కోసుకుని ఆలయ గుమ్మంలో పెట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ భక్తుడి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గుడికి వెళ్లి

పశ్చిమ శిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పురబ్ షిరా గ్రామానికి చెందిన సంపత్ (38).. అతని భార్య బన్నో దేవితో కలిసి శనివారం శీతలా మాతను దర్శించుకునేందుకు వచ్చారు. గంగా స్నానం అనంతరం సంపత్ తన సతీమణితో కలిసి శీతలా మాతకు పూజలు చేశారు. ఇద్దరూ ఆలయంలో ప్రదక్షిణలు చేసి తిరిగి వస్తుండగా.. సంపత్ బ్లేడ్‌తో తన నాలుకను కోసుకొని ఆలయ గుమ్మంలో పెట్టాడు.

కలకలం

ఇది చూసిన ఆలయంలోని ఇతర భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సంపత్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

శుక్రవారం రాత్రి తన భర్త శీతలా మాతను చూడాలని చెప్పినట్లు సంపత్ భార్య తెలిపింది. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరూ గంగా స్నానం చేసి ఆలయంలో పూజలు చేయగా.. తన భర్త హఠాత్తుగా ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

శీతలా మాతను చూడాలని ఉందని నా భర్త కోరాడు. దీంతో ఆయన కోరికను కాదనడం ఎందుకని ఉదయాన్నే గుడికి తీసుకువచ్చాను. గంగా స్నానం చేసి, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాం. తరువాత దర్శనానికి గుడి లోపలికి వెళ్లాం. ఏమైందో తెలీదు.. హఠాత్తుగా నా భర్త.. బ్లేడుతో నాలుక కట్ చేసుకొని ఆలయ గుమ్మం ముందు ఉంచాడు. ఇంత పని చేస్తాడని నేను అసలు అనుకోలేదు.                                                                              - బన్నో దేవి, బాధితుడి భార్య

శనివారం ఈ ఘటన జరిగింది. సంపత్ అనే వ్యక్తి శీతలా మాతను దర్శించుకున్న తర్వాత హఠాత్తుగా తన నాలుక కోసుకొని దేవికి సమర్పించాడు. ఇది చూసి అక్కడి భక్తుల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకొని సంపత్‌ను ఆసుపత్రికి తరలించాం. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.                           - అభిలాష్ తివారీ, ఎస్‌హెచ్‌ఓ 

Also Read: Krishnam Raju Death News: కృష్ణంరాజు మరణంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Also Read: Queen Elizabeth Death: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్-II మృతికి నివాళిగా భారత్‌లో సంతాపదినం

Published at: 11 Sep 2022 10:42 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.