Joe Biden On Covid-19: కరోనా కథ ముగిసింది- జో బైడెన్ కీలక ప్రకటన

ABP Desam   |  Murali Krishna   |  19 Sep 2022 05:03 PM (IST)

Joe Biden On Covid-19: కరోనా ఇక మహమ్మారి కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

(Image Source: PTI)

Joe Biden On Covid-19: కరోనా మహమ్మారి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ 19 కథ ముగిసిందని బైడెన్ ప్రకటించారు. అయితే కొవిడ్‌తో సమస్యలు ఉన్నాయన్నారు. ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన ఆటో షోలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ 19 మహమ్మారి దశ ముగిసింది. ప్రస్తుతం ఎవరూ మాస్కులు ధరించడం లేదు. దీనిని మార్పుగా భావిస్తున్నాం. అయితే కొవిడ్‌తో సమస్యలు ఉన్నాయి. దానిపై పని చేయాల్సి ఉంది.                                       -  జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

విమర్శలు

బైడెన్‌ ప్రకటనపై రిపబ్లికన్లు విమర్శలు చేశారు. పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని పొడిగించడాన్ని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి ముగిస్తే మళ్లీ దీనిని పొడిగించడం దేనికి అని ప్రశ్నించారు. వాస్తవానికి వచ్చే నెలతో పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జీ సమయం ముగియాల్సి ఉంది. ఒక వేళ ప్రభుత్వం పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ముగిస్తే దాదాపు 1.5 కోట్ల మందికి బీమా సౌకర్యం అందదు. 

మరణాలు

బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి అమెరికాలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య 57,000కి తగ్గింది. చాలా మంది ఇంటి వద్దే పరీక్షలు చేసుకొంటున్నారు. దీంతో చాలా కేసులు నమోదు కావడంలేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కొవిడ్ వల్ల రోజువారీ 400కుపైగా మరణాలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

తైవాన్‌పై

మరోవైపు తైవాన్‌ అంశంపై జో బైడెన్ మళ్లీ గందరగోళ వ్యాఖ్యలు చేశారు. ఊహించని దాడుల నుంచి తైవాన్‌ను తాము రక్షిస్తామని బైడెన్ అన్నారు. తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు వెళ్తాయా? అని మీడియా ప్రశ్నించగా దీనికి బైడెన్‌ నిస్సంకోచంగా 'అవును' అని తేల్చిచెప్పారు. అయితే తైవాన్‌ స్వాతంత్ర్య కాంక్షను ప్రోత్సహించమని బైడెన్ అన్నారు.

అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించడం వివాదాస్పదమైంది. ఒక్కసారిగా చైనా అమెరికాపై కస్సుమంటూ తైవాన్‌ సరిహద్దుల్లో సైన్యం మోహరింప చేసి యుద్ధాని రెడీ అంది. ఎంతగా అమెరికా నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వినకపోగా యుద్ధ కాంక్షతో రగిలిపోయింది. ఇలాంటి సమయంలో బైడెన్ మరోసారి చైనాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

Also Read: Nandigram Cooperative Body Election: బంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్- భాజపా భారీ విజయం!

Also Read: Work From Home Ends: ఇక ఆఫీసులకు రండి- ఉద్యోగులకు TCS పిలుపు!

Published at: 19 Sep 2022 04:53 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.