Sadhguru on Migration:


సద్గురు:  కొంతకాలం క్రితం, నేను ముంబయి వెళ్లాను. అక్కడ ఓవైపు పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. మరో వైపు మురికివాడ ఉంది. అప్పుడది వర్షాకాలం తర్వాతి సమయం. వర్షాకాలంలో సాధారణంగా మురుగు నీరు పొంగి పొర్లుతుంది. ఆ మురికివాడ బహుశా 150 లేదా అంతకంటే ఎక్కువ ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్నిచోట్లా సుమారు ఒక అడుగు లోతు పాటు మురికి ఉంది. కానీ అది సర్వసాధారణం అన్నట్లు అందరూ అందులోనే నడుస్తున్నారు. అక్కడే నివసిన్నారు. వలస వచ్చిన వారు ఇలాంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం, దాదాపు 11 నుంచి 12 కోట్ల ప్రజలు, అంటే భారతదేశ పట్టణ జనాభాలో దాదాపు 26 శాతం మంది, మురికివాడల్లో ఉంటున్నారు. 2035 నాటికి, 22 కోట్ల మంది గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళతారని అంచనా. అదే జరిగితే, పట్టణాల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ప్రతి నగరానికీ, అదనంగా ఇంకో కోటి మంది వస్తే, ఎవరూ ఆ ప్రాంతాల్లో సంతోషంగా బతకలేరు. 


కొన్ని వందల సంవత్సరాల పాటు తమ వాళ్లు జీవించిన నేలని వదిలి వెళ్ళేంత కష్టం వారికేమొచ్చింది? ప్రజలు గ్రామాలు విడిచి వెళ్ళాలనుకోడానికి కారణం, అక్కడ వారికి ఎలాంటి జీవనోపాధి దొరకకపోవడం. తమ గ్రామంలోనే మంచి జీవితాన్ని గడపగలిగితే, చాలా వరకూ ఎవరూ ఇలా వలస వెళ్లరు. అక్కడి పరిస్థితులతో పాటు డబ్బు సంపాదించడం ఎలా అన్నది తెలుసుకోడానికి, ముందు కుటుంబంలో ఒకరిని నగరానికి పంపిస్తారు. ఇల్లూ అదీ కట్టుకోడానికి ప్రణాళిక సిద్దం చేసుకుని ఆపై వెళ్తారు. కానీ ప్రస్తుతం, అందరూ ఎలాంటి ప్రణాళికా  లేకుండా వలస పోతున్నారు, ఎందుకంటే పరిస్థితులు వారిని అలా ప్రభావితం చేస్తున్నాయి. 
  
వలసల్ని అరికట్టాలంటే గ్రామీణ భారతాన్ని పట్టణీకరణ చేయాలి. మనం చేయగలిగిన అతి సులువైన పనేమిటంటే, ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడం. ప్రస్తుతం బిల్డింగులు ఇంకా మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కానీ చాలా స్కూళ్ళల్లో సరైన బోధనా వసతులు, విద్యా సంస్కృతి లేవు. తాము విద్య నేర్చుకున్నామని అనుకుంటున్నప్పటికీ, సాధారణ కూడికలు కూడా చేయలేని 15, 16 ఏళ్ల పిల్లలు, ప్రస్తుతం మనదేశంలో కనీసం 80 లక్షల నుంచి కోటి మంది దాకా ఉండి ఉంటారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ స్కూళ్లన్నిటినీ ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తే…ప్రభుత్వ నిధులతో పాటు తమ సొంత నిధులతో ఓ వంద స్కూళ్ళని కూడా సమర్థవంతంగా నడపగల సామర్థ్యం ఉన్న పరిశ్రమలు ఇంకా వ్యాపార సంస్థలు ఎన్నో ఉన్నాయి.    


ఇలాంటి విద్యా విధానంతో వచ్చిన మరొక నష్టమేమిటంటే, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వ్యవసాయం, చెక్క పని లాంటి నైపుణ్యాలు కూడా నేర్చుకోవట్లేదు. చదువు లేదు, నైపుణ్యాలు లేవు, పై చదువులకి కూడా వెళ్లరు. ఇది అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేని యువతే, ఎక్కువగా నేరాలు, తీవ్రవాదంతో పాటు ఇతర రకాల ప్రతికూల కార్యకలాపాలకు పాల్పడేవారిగా మారే ప్రమాదం ఉంది. అందుకే వారికి నైపుణ్యాలు నేర్పించడం ఎంతో ముఖ్యం. ప్రతి గ్రామంలో కాకపోయినా, కనీసం ప్రతి తాలూకాలోనైనా నైపుణ్య కేంద్రాలు ఉండాలి. దీన్ని ప్రైవేటు రంగాలు చేపడితే మేలు, ఎందుకంటే అన్నీ ప్రభుత్వమే చేయాలంటే, అందుకు ఎంతో సమయం పడుతుంది.


ఇంకో విషయమేమిటంటే, ప్రతి గ్రామంలో ఒక సినిమా థియేటర్‍ను  ప్రారంభించాలి. ఎందుకంటే కేవలం సినిమాలు చూడటానికే ప్రజలు పట్టణాలకు వస్తున్నారు. ఇలా ఒక సారి వచ్చాక, ఇక తిరిగి వెళ్లరు. క్రీడలకు సంబంధించిన వసతులు కూడా కొన్ని నిర్మించాలి. పెద్ద పెద్ద మైదానాలు కాకపోయినా, యువత కోసం కనీసం కొన్ని వ్యాయామశాలలైనా నిర్మించాలి, లేకపోతే దేశంలో విపరీతంగా పెరుగుతున్న మద్యం ఇంకా మాదకద్రవ్యాల వినియోగం, మరో 10-15 ఏళ్లలో అతి పెద్ద సవాలుగా మారుతుంది. చాలాకాలం క్రితం నేను, మురికి వాడలో జీవించే కొంతమందితో కలిసి పని చేసినప్పుడు, వారిలో దాదాపు 80 శాతం మంది సాయంకాలం మద్యం సేవించే వాళ్ళు. నేనొక వ్యాయామశాల ప్రారంభించి, యువత అందరినీ అందులోకి రప్పించాను. తరవాత వారిలో 70 శాతానికి పైగా మద్యం మానేశారు, ఎందుకంటే వాళ్ళు  ఫిట్‍నెస్ పై శ్రద్ధ చూపడం మొదలుపెట్టారు.  


గ్రామీణ జనాభాకి వినోదం, ఆటలు, చదువు ఇంకా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. మనం గనుక ఇది చేస్తే, కచ్చితంగా గ్రామాల నుంచి వలసల్ని అరికట్టవచ్చు. దాన్ని బలవంతంగా  అరికట్టలేం. సరైన సదుపాయాలు కల్పించి, పల్లెల్ని ఇంకా గ్రామాల్ని జీవించడానికి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ద్వారా మాత్రమే ఇది చేయగలం. 


భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన 50 మంది వ్యక్తుల్లో ఒకరు సద్గురు. ఆయన ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన, విశిష్టమైన  సేవలు  అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత  పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 3.91 కోట్ల ప్రజలకు చేరువైన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన  ‘మట్టిని రక్షించు’  ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.


[ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు, ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అభిప్రాయాలు, నమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపవు. ]