జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన బుల్లితెరపై ఏ షో చేసినా హిట్ పక్కా. అయితే, సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ టీవీ షోస్‌కు టైమ్ కేటాయించలేకపోతున్నారు. ఇంతకు ముందు ఆయన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో హోస్ట్‌గా అదరగొట్టారు. అంతేకాదు, తెలుగులో ‘బిగ్ బాస్’ షోకు హోస్ట్‌గా అదరగొట్టారు కూడా. అయితే, ఎన్టీఆర్ కేవలం ఒక్క షోకు మాత్రమే పరిమితం కావడం ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్.. తన ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలిసింది. ఓ ఓటీటీ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈటీవీ ఛానెల్‌లో ఓ టాక్ షో చేయడానికి నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారట. ఈ టాక్ షో ఈ టీవీ విన్ (OTT) ఛానెల్‌లో ప్రసారం కానున్నట్లు సమాచారం. అయితే, ఈ టాక్ షో కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే సైన్ చేశారా? లేదా ఇంకా పరిశీలనలో ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సమాచారం తెలిసి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్టీఆర్ హోస్టింగ్ అంటే పంచ్‌లు ఫన్ రెండూ ఉంటాయి. అందుకే, ఆయన క్రేజ్‌ను ఉపయోగించుకోడానికి ఈటీవీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీ ‘అన్‌స్టాపబుల్’ షోతో పాపులారిటీ సంపాదించింది. ఈ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇది వరకు సమంత ‘సామ్ జామ్’ షోకు కూడా మంచి ఆధరణ లభించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసే షో ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. 


‘బిగ్ బాస్’ నుంచి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ వరకు


జూనియర్ ఎన్టీఆర్ 2017లో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 1తో హోస్ట్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఆకట్టుకోవడంతో షో కూడా హిట్ కొట్టింది. అయితే, ఆ తర్వాతి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసేందుకు అంగీకరించలేదు. దీంతో రెండవ సీజన్ నానితో కానిచ్చారు. మూడో సీజన్ నుంచి ఆ బాధ్యతను నాగార్జున తీసుకున్నారు. 2021లో మళ్లీ ప్రసిద్ధ క్విజ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సీజన్-5కు హోస్టింగ్ చేశారు. తాజాగా ఈటీవీ షోకు అంగీకరిస్తే.. హోస్ట్‌గా ఎన్టీఆర్‌కు ఇది మూడో షో అవుతుంది.


సినిమాల్లోనూ బిజీ బిజీ


ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 (#NTR30) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌తో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ మూవీలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అలాగే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘వార్-2’లో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. దర్శకుడు వెట్రిమారన్ మూవీలో కూడా ఎన్టీఆర్ నటించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ తెరకెక్కేందుకు మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. 


Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య