Chirag Paswan: కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కి ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. మితిమీరిన వేగంతో వెళ్లినందుకు చలానా విధించారు. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్‌ కార్‌ నంబర్‌పైన ఓ ఇ-చలానాని జారీ చేశారు. బిహార్‌లోని టోల్‌ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్‌లో ఇది రికార్డ్ అయింది. హాజిపూర్ నుంచి చంపారన్‌కి వెళ్తున్న సమయంలో చాలా వేగంగా చిరాగ్ కార్‌ చాలా వేగంగా వెళ్లింది. అందుకే చలానా పడింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మోటార్ వెహికిల్ యాక్ట్‌లో భాగంగా బిహార్‌లో దాదాపు 13 టోల్‌ ప్లాజాల వద్ద  e-detection సిస్టమ్‌ ఇన్‌స్టాల్ చేశారు.


ఈ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చిన వారం రోజులకే సుమారు 16,700 ఇ- చలానాలు జారీ అయ్యాయి. వీటి విలువ రూ.9.49 కోట్లు. వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తుంది. స్పీడ్‌నీ డిటెక్ట్ చేస్తుంది. ఆర్‌సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్..ఇలా అవసరమైన డాక్యుమెంట్స్ ఏం లేకపోయినా సరే ఇ-చలానా జారీ అవుతుంది. ఆగస్టు 7-15వ తేదీ మధ్య కాలంలో బిహార్‌లో భారీ ఎత్తున చలానాలు జారీ అయ్యాయి. వీటిలో 9 వేలకు పైగా వాహనాలు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినవే. మిగతావన్నీ బిహార్ వాహనాలే అని అధికారులు వెల్లడించారు. (Also Read: Supreme Court: బుల్‌డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సీరియస్, నిందితులైతే ఇళ్లు కూల్చేస్తారా అని అసహనం)


ఏంటీ ఇ-డిటెక్షన్ సిస్టమ్?


రాష్ట్రవ్యాప్తంగా బిహార్ ప్రభుత్వం ఇ-డిటెక్షన్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్‌ ప్లాజాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇవి ఆటోమెటిక్‌గా చలానాలు జారీ చేస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు సరైన విధంగా పాటిస్తున్నారా లేదా అన్నది వీటి ద్వారానే గుర్తిస్తారు. అంతే కాదు. చలానాలు విధించడానికీ ఈ సిస్టమ్‌నే వినియోగిస్తున్నారు. ఆగస్టు 18 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. జాతీయ రహదారుల్లో అడ్వాన్స్‌డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్ని వాహనాలు ఆ రహదారి గుండా వెళ్తున్నాయో ఈ కెమెరాలు గమనిస్తాయి. వెహికిల్‌కి ఫిట్‌నెస్ లేకపోయినా, ఎక్కువగా పొగ వస్తున్నా, మితిమీరిన వేగంతో వెళ్లినా వెంటనే ఓనర్‌ పేరిట ఓ చలానా వస్తుంది. ఓనర్ మొబైల్ నంబర్‌కి సమాచారం అందుతుంది. 


చిరాగ్ పాశ్వాన్ ఇటీవల ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. లోక్‌జనశక్తి పార్టీ, బీజేపీ మధ్య విభేదాలున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, వదంతులేనని స్పష్టం చేశారు. మోదీ నుంచి తనను ఎవరూ విడదీయలేరని వెల్లడించారు. PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంగీకరిస్తే వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని అన్నారు. తాను ఎప్పటికీ మోదీ సర్కార్‌కి విధేయుడిగానే ఉంటానని, ఆ ప్రభుత్వం అభిప్రాయాలను గౌరవిస్తానని తెలిపారు. కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనూ బీజేపీతో మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అటు ఇండీ కూటమి నేతలు మాత్రం విభేదాలున్నాయని ప్రచారం చేస్తున్నారు. 

Also Read: Viral Video: డిస్‌ప్లే బొమ్మకి ముద్దు పెట్టి పెళ్లాడిన యువకుడు, ఆ తరవాత ఏం చేశాడంటే - వీడియో