Uddhav Thackeray Team In SC:


ఇవన్నీ విషపూరితమైన చర్యలే..


ఏక్‌నాథ్ శిందేపై మరోసారి విమర్శలు గుప్పించింది ఉద్దవ్ ఠాక్రే శివసేన టీం. పార్టీకి వెన్నుపోటు పొడిచింది కాకుండా, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన ఎవరిది అన్న అంశంపై  సుప్రీం కోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది. "శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కట్టు కథలు అల్లారు" అని సుప్రీం కోర్టుకి వెల్లడించింది ఠాక్రే టీం. "ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లంతా రెండున్నరేళ్ల పాటు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. కానీ అప్పుడెవరూ దీని గురించి మాట్లాడలేదు" అని స్పష్టం చేసింది. "ఫ్లోర్ టెస్ట్ నుంచి, ఏక్‌నాథ్
శిందేని ముఖ్యమంత్రిగా ప్రకటించిప్పటి వరకూ జరిగిన పరిణామాలన్నీ విషపూరితమైన చర్యలే. రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులోనూ అదే విషాన్ని చిమ్ముతున్నారు" అని ఠాక్రే బృందం గట్టిగా వాదిస్తోంది. యాంటీ పార్టీ కార్యకలాపాలను కవర్ చేసుకునేందుకే "రియల్ సేన" అనే అంశం తెరపైకి తీసుకొచ్చి ఈసీని సంప్రదించారని మండి పడుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్రను వదిలేసి, భాజపా పాలిత గుజరాత్‌కు వెళ్లటం, అస్సోంలోని భాజపా ఒడిలో కూర్చోవటాన్ని తలుచుకుంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని అంటున్నారు ఠాక్రే బృందంలోని నేతలు. 


శివసేన ఎవరిదో అప్పుడే తేలాలి..


శివసేన, భాజపా మధ్యలో గతంలో కూటమిగా ఉన్నప్పటికీ...భాజపా ఎప్పుడూ తమను గౌరవించలేదని, సమానత్వ హోదా ఇవ్వలేదని ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే. "మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం వచ్చినప్పుడే శివసేన నేతకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ప్రస్తుత రెబల్ ఎమ్మెల్యేలు...ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఎమ్మెల్యేలందరూ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. అప్పుడెవరూ ప్రజల్లో అసంతృప్తిగా ఉందన్న విషయం ప్రస్తావించలేదు. వాళ్లకు ఈ ప్రభుత్వంతో ఇబ్బంది ఉండి ఉంటే, క్యాబినెట్‌లో చేరకుండా ఉండాల్సింది" అని అంటున్నారు ఠాక్రే తరపున నేతలు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ పూర్తయ్యేంత వరకూ ఎన్నికల సంఘం "శివసేన ఎవరిది" అనే అంశాన్ని పక్కన పెట్టాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఇప్పటికే సుప్రీం కోర్టు ఠాక్రేకు, శిందేకు ఆదేశాలిచ్చింది. ఎవరికి మెజార్టీ ఉందన్నది నిరూపించుకుని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయాలని చెప్పింది. ఆగష్టు 8వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే...రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయం తేలనంత వరకూ, ఎవరికి ఎంత బలం ఉంది అన్నది తేల్చి చెప్పలేమని అంటున్నారు ఠాక్రే. అందుకే...తీర్పు వచ్చేంత వరకూ ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతున్నారు. 


Also Read: Conjoined Twins: 27 గంటల పాటూ 100 మంది వైద్యుల కష్టం, అవిభక్త కవలలకు పునర్జన్మ - ఉపయోగపడిన వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ


Also Read: Anantapur: మాట్లాడుకుందాం రమ్మని లవర్‌కి ఆహ్వానం, కారుతో గుద్దేసిన ప్రియుడు - ట్విస్ట్ ఏంటంటే