Top Headlines Today: 


వైసీపీ సంబరాలు 


నవ్యాంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుని 2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. కొత్త పథకాలకు రూపం ఇస్తూ, మరోసారి అధికారంలోకి రావడానికి పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్యన తిరగడమేగాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లతో సేవలందించడం తమకు ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ ఇచ్చిన టార్గెట్ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో భారీగా బైక్ ర్యాలీలకు వైసీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి.


 


ఎస్పీ కార్యాలయానికి నేడు శంకుస్థాపన


వనపర్తిలో కొత్త నిర్మించిన ఎస్పీ ఆఫీస్‌ను మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ప్రారంభించనున్నారు. 3 అంతస్తులు 60 గదులతో 29 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. క్రైం డిపార్ట్‌మెంట్‌, అడ్మిస్ట్రేషన్ డిపార్టమెంట్‌, ఇంటెలిజెన్స్, డాగ్ స్క్వాడ్‌, డిజిటల్‌ ల్యాబ్‌లు,  ట్రైనింగ్ హాల్, సీసీఆర్, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, సైబర్‌ ల్యాబ్ ఇక్కడ ఉన్నాయి. 


 


విజయవాడలో సీఎం పర్యటన


విజయవాడలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను ఏపీ ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. అనాథ పిల్లలతో జగన్ ముచ్చటించనున్నారు. 


 


యువగళం పునఃప్రారంభం


మహానాడు కోసం నాలుగు రోజుల తాత్కాలికంగా ఆగిన పాదయాత్ర నేటి నుంచి పునఃప్రారంభంకానుంది. కర్నూలులో యాత్ర ముగించిన అనంతరం మహానాడు కోసం చిన్న  బ్రేక్ తీసుకున్నారు లోకేష్. ఇవాళ్టి నుంచి యువగళం పాదయాత్ర కడపలోని జమ్మలమడుగు నుంచి ప్రారంభంకానుంది. 


 


ప్రభుత్వ ఉద్యోగుల నిరసన 


తమ డిమాండ్లు పరిష్కరించాలన్న నినాదంతో కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తున్నారు. 


 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


మోంటే కార్లో ఫ్యాషన్స్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మోంటే కార్లో ఫ్యాషన్స్ రూ. 19.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 237 కోట్ల ఆదాయం వచ్చింది.


బెస్ట్‌ ఆగ్రోలైఫ్: 2022-23 నాలుగో త్రైమాసికంలో బెస్ట్ ఆగ్రోలైఫ్‌కు రూ. 8.4 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కంపెనీకి రూ. 254 కోట్ల ఆదాయం వచ్చింది.


వేదాంత, ITC: వేదాంత, ఐటీసీ కంపెనీల షేర్లు ఈరోజు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్‌ అవుతాయి. అంటే, ఆయా కంపెనీలు ప్రకటించిన డివిడెండ్‌ మేరకు షేర్‌ ధర తగ్గిపోతుంది.


NBCC (ఇండియా): జనవరి-మార్చి కాలంలో NBCC (ఇండియా) రూ. 108 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,790 కోట్లుగా ఉంది.


రైల్‌ వికాస్ నిగమ్: నాలుగో త్రైమాసికంలో రైల్ వికాస్ నిగమ్ రూ. 359 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 5,719 కోట్ల ఆదాయాన్ని ఈ సంస్థ సంపాదించింది.


టొరెంట్ పవర్: జనవరి-మార్చి కాలానికి టొరెంట్ పవర్ రూ. 450 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 6,038 కోట్ల ఆదాయం ఆర్జించింది.


శోభ: మార్చి త్రైమాసికంలో శోభ రూ. 48.6 కోట్ల నికర లాభం మిగుల్చుకుంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,209 కోట్లుగా ఉంది.


జూబిలెంట్ ఫార్మోవా: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జూబిలెంట్ ఫార్మోవా రూ. 98 కోట్ల నికర నష్టాన్ని నెత్తిన వేసుకుంది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 1,660 కోట్లు.


IRCTC: ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన కేటరింగ్‌ & టికెటింగ్ విభాగమైన IRCTC, 2023 మార్చి త్రైమాసికంలో రూ. 279 కోట్ల స్వతంత్ర నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 30% వృద్ధి.