వివేక హత్య కేసులో సీబీఐ విచారణ కంటిన్యూ 


వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా రెండో రోజు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కస్టడీలోకి తీసుకున్న భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను కూడా సీబీఐ ప్రశ్నించనుంది. వీళ్లు ఇచ్చిన సమాచారంతో కడపలో మరికొందర్ని విచారించేందుకు సీబీఐ బృందాలు వెళ్లాయి. మూడు రోజులుగా అక్కేడ మకాం వేసిన అధికారులు మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. 


కోడి కత్తి కేసులో నేడు శ్రీనివాస్ వాదనలు 


కోడికత్తి కేసుపై ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై జగన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇవాళ నిందితుడు శ్రీనివాస్‌ తరఫు లాయర్, ఎన్‌ఐఏ వాదనలు వినిపించనున్నారు. ఈ సోమవారం నాలుగు గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. సీఎం జగన్ తరఫు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు.. న్యాయమూర్తి ఎదుట వాదనలు నాలుగు గంటల పాటు వాదనలు వినిపించారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యులను అధికారులు విచారించారని తెలిపారు. మూడు బృందాల అధికారులు ఈ విచారణ జరిపారన్నారు. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి సైతం అర్థమవుతుందన్నారు. సీఎం జగన్ వాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. జన్మభూమి కమిటీ సిఫార్సుతో నిందితుడు శ్రీనివాసరావుకు తానేకంక గ్రామంలో ఇంటి స్థలం వచ్చిందని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనును పథకం ప్రకారమే టీడీపీ నేత హర్ష వర్ధన్ చౌదరి రెస్టారెంట్ లోకి తీసుకెళ్లారన్నారు. నిందితుడి గ్రామంలోని ఫ్లెక్సీపై సినీనటుడు ముందుగా చెప్పిన గరుడ ఫొటో ఎందుకు వచ్చిందని వాదించారు. నిందితుడు శ్రీనివాస్ పై కేసు ఉన్నప్పటికీ విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా జారీ చేసిందో విచారణ జరపాలని కోర్టును కోరారు. ఫుడ్ అండ్ ఫ్యూజన్ అధినేత, టీడీపీ సానుభూతిపరుడు హర్షవర్థన్‌ చౌదరిని ఎన్ఐఏ విచారించలేదన్నారు. ఎన్ఐఏ మొదటి పిటిషన్ వేసిన తర్వాత మరలా ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. బాధితునిగా సీఎం జగన్‌కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉందని వాదనలు వినిపించారు.


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ గడువు నేటితో లాస్ట్ 


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్‌ ఇంట్రెస్ట్ గడువు నేటితో ముగియనుంది. ఈ గడువు గత శనివారంతో ముగిసిన వివిద వర్గాల నుంచి వస్తున్న స్పందనతో 20 వరకు పెంచారు. ఇది ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటి వరకు ఈవోఐకి 22 సంస్థలు ఆసక్తి చూపించాయి. అందులో ఆరు విదేశీ కంపెనీలు కాగా... 16 స్వదేశీ సంస్థలు. స్టీల్ ప్లాంట్ బిడ్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా పాల్గొన్నారు.  ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో ర్యాలీ నిర్వహించిన తర్వాత EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈవోఐ ప్రకారం అయితే నగదు లేదా ముడి సరకు మూలధనంగా సమకూర్చాలి.  క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని నెలకు రూ. 850 కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని జేడీ లక్ష్మినారాయమ ప్రకటించారు.   తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కసారి వందరూపాయలు ఇస్తే చాలని ఆయన లెక్కలు చెప్పారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో సింగరేణి సంస్థ పాల్గొందా లేదా అనేది స్పష్టత రాలేదు. శనివారం రోజున మాత్రం బిడ్ దాఖలు చేయలేకపోయిన ఆ సంస్థ గడువు పెంచాలని రిక్వస్ట్ చేసినట్టు సమాచారం. 


బౌద్ధ సమ్మిట్ 


నేడు రేపు ఢిల్లీలో గ్లోబల్ బౌద్ధ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. హోటల్ అశోక్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబిసి) సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రెండు రోజుల పాటు ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా ప్రముఖ అమెరికన్ ప్రొఫెసర్ రాబర్ట్ థుర్మాన్, వియత్నాం బౌద్ధ సంఘ డిప్యూటీ పాట్రియార్క్ హిస్ హోలీనెస్ థిచ్ ట్రై క్వాంగ్ పాల్గొంటారు. భారతదేశ ప్రాచీన బౌద్ధ వారసత్వాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి 2020లో ప్రొఫెసర్ థుర్మాన్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు లభించింది. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు 30 దేశాల నుంచి సుమారు 200 మంది బౌద్ధ గురువులు హాజరవుతారు. 


'సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందన: ఫిలాసఫీ టు  ప్రాక్సిస్‌. థీంతో ఈ సమావేశం జరగనున్నాయి. బౌద్ధ, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన విషయాలపై ప్రపంచ బౌద్ధ ధర్మ నాయకత్వం, పండితులను నిమగ్నం చేయడం, వాటిని సమిష్టిగా పరిష్కరించేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రయత్నిస్తుంది. 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పండితులు, సంఘ నాయకులు, ధర్మాచార్యులు ఈ సదస్సులో పాల్గొంటారని, వారు ప్రపంచవ్యాప్త సమస్యలపై చర్చించి సార్వత్రిక విలువలపై ఆధారపడిన బుద్ధ ధర్మంలో సమాధానాల కోసం చూస్తారు. 


రాహుల్ శిక్షపై నేడు తీర్పు 


మోదీ పేరుపై చేసిన కామెంట్స్‌కు పరువు నష్టం కేసులో ఇరుక్కొన్న రాహుల్‌కు ఊరట లభిస్తుందా. తనకు విధించిన శిక్షపై గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో ఆయన పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ ఇవాళ సెషన్స్‌ కోర్టులో విచారణకు రానుంది. మోదీ పేరుపై సెటైర్లు వేసి ఓ వర్గాన్ని కించపరిచారన్న కారణంతో రాహుల్‌కు సూరత్‌లోని మెట్రోలపాలిటిన్ మేజిస్ట్రేట్‌ రెండేళ్ల శిక్ష వధించింది. దీంతో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం కూడా పోయింది. ఇది రెండేళ్లు శిక్ష వేసేంత నేరం కాదని రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్లారు. రాహుల్ పిటిషన్‌పై గత వారం వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. 


తిరుమల భక్తుల సమాచారం 


జులై నెలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ ఇవాళ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు వెబ్‌సైట్లో టికెట్లను పెట్టనుంది. లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లు కేటాయిస్తారు. ఉదయం పదకొండున్నరకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. మధ్యాహ్నాం మూడు గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. 


74వ సంవత్సరం లోకి అడుగు పెట్టిన చంద్రబాబు 


తెలుగదేశం అధినేత చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకను ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుపుకోనున్నారు. 74వ పడిలోకి అడుగుపెడుతున్న ఆయన ప్రజల కోసం సరికొత్త కార్యక్రమం ప్రకటించనున్నట్టు తెలిపారు. మార్కాపురంలో రోడ్‌షో, బహిరంగ సభలో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉంది. 


ఐపీఎల్‌ 2023లో నేటి నుంచి డబుల్‌ హెడర్‌ మ్యాచులు


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో గురువారం డబుల్‌ హెడర్‌ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో పంజాబ్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. మొహాలిలో మరి ఆర్సీబీ గట్టిపోటీనిచ్చేనా?


గబ్బర్‌ డౌటే!


పంజాబ్‌ కింగ్స్‌ (Royal Challengers Bangalore) ఈ సీజన్లో అమేజింగ్‌ విక్టరీస్‌తో దూసుకుపోతోంది. ఫియర్‌ లెస్‌ క్రికెట్‌ ఆడుతోంది. కెప్టెన్ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan), సీనియర్లు లేనప్పటికీ చివరి మ్యాచులో లక్నోపై ఆఖర్లో అవకాశాలను సృష్టించుకొని విజయం అందుకుంది. ఈ మ్యాచుకూ గబ్బర్‌ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. గాయం నుంచి అతడింకా కోలుకోలేదనే అనిపిస్తోంది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ రిహాబిలిటేషన్‌ సాగుతోంది. అతడు అందుబాటులోకి వస్తే మరింత డిస్ట్రక్టివ్‌ బ్యాటింగ్‌ డెప్త్‌ దొరుకుతుంది. సికిందర్‌ రజా బంతి, బ్యాటుతో ఆదుకుంటున్నాడు. షారుక్ ఖాన్‌ ఫర్వాలేదు. బౌలింగ్‌లో అర్షదీప్‌ కీలకం. రబాడాకు ఆర్సీబీపై మంచి రికార్డుంది. టీ20ల్లో డుప్లెసిస్‌, కోహ్లీ, మాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ను చాలాసార్లు ఔట్‌ చేశాడు. కరణ్‌, హర్‌ప్రీత్‌, రాహుల్‌ చాహర్‌, ఆకాశ్ బౌలింగ్‌ ఫర్వాలేదు.


రబాడతో ఆర్సీబీకి భయం!


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును (Royal Challengers Bangalore) ప్రతి సీజన్లో ఎదురయ్యే సమస్యే వేధిస్తోంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే మిడిలార్డర్లో ఎవ్వరూ ఆదుకోవడం లేదు. విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్‌వెల్‌ మినహా ఎవ్వరూ ఫామ్‌లో లేరు. లోమ్రర్‌, ప్రభుదేశాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌ భాగస్వామ్యాలు నెలకొల్పడం లేదు. దినేశ్ కార్తీక్‌ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్సు ఇప్పటి వరకు ఆడలేదు. రబాడాతో ఆర్సీబీ బ్యాటింగ్‌ లైనప్‌కు ప్రమాదం పొంచివుంది. మహ్మద్‌ సిరాజ్ బౌలింగ్‌ ఫర్వాలేదు. వేన్ పర్నెల్‌ కొనసాగొచ్చు. హర్షల్‌ పటేల్ వికెట్లు తీయాలి. వనిందు హసరంగ, షాబాజ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఫర్వాలేదు. అయితే చిన్నస్వామిలో వీరు ప్రభావం చూపించడం లేదు. జోష్ హేజిల్‌వుడ్‌ ఇంకా ఫిట్‌నెస్‌ సాధించలేదు. పంజాబ్‌తో చివరి ఆరు మ్యాచుల్లో ఆర్సీబీ ఐదు సార్లు ఓడిపోవడం నెగెటివ్‌ సైన్‌.


నేడు జైలు నుంచి విడుదల కానున్న సైఫ్‌


వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఇవాళ జైలు నుంచి విడుదలకానున్నాడు. ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారించే కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్ కు బెయిల్ మంజూరు చేశారు.
ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే నాటికి లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నిందితుడు, సీనియర్ విద్యార్థి సైఫ్ నకు ఆదేశించింది కోర్టు. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ జైలు నుంచి విడుదల కానున్నాడు. సైఫ్ తరఫు లాయర్లు సంబంధిత పత్రాలను జైలు అధికారులకు సమర్పించడం, కోర్టు ఉత్తర్వుల కాపీ జైలుకు అందిన తరువాత ఖమ్మం జైలు నుంచి విడుదల కానున్నాడు.