Headlines Today : వివేక హత్య కేసులో అవినాష్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వివేక కుమార్తె సునీత వాదనలు కూడా హైకోర్టు వినబోతుంది. మరోవైపు ఇదే కేసులో మరోసారి అవినాష్‌ను విచారించనుంది సీబీఐ. సాయంత్రం విచారణకు రావాలని అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది. సోమవారం జరగాల్సిన విచారణ కోర్టు ఆదేశాల మేరకు ఈ సాయంత్ర జరగనుంది. 


స్వలింగ సంపర్క వివాహాన్ని చట్టబద్ధం చేస్తారా? నేడు సుప్రీంకోర్టులో విచారణ


స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. అంతకుముందు, న్యాయపరమైన గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది, "ఈ విషయం సుప్రీంకోర్టు (సుప్రీంకోర్టు) నిర్ణయించాల్సినది కాదు. కోర్టు తన వంతుగా వివాహ అనే కొత్త వ్యవస్థను సృష్టించజాలదు. దాన్ని పరిగణనలోకి తీసుకోవడం కోర్టు పని కాదని, పార్లమెంటు పని అన్నారు.


వాస్తవానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును మార్చి 13న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.


కడప, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన


ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం కడప, కర్నూలు జిల్లాల్లో జరగనుంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. మంగళవారం, బుధవారాల్లో ఆయన ఈ జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా పార్టీ  బలోపేతానికే చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఈ మధ్యాహ్నం కడపలో జోన్‌-5 సమావేశం నిర్వహిస్తారు. దీనికి కడప, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, జిల్లాల పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల నేతలు పాల్గొంటారు. బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. 


నేడూ రేషన్ పంపిణీ







ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరకుల పంపిణీని 18వ తేదీ వరకు అంటే నేటి వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదని అందుకే మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిపారు అధికారులు. వాస్తవంగా అయితే ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ సరఫరా చేస్తారు. ఈ సారి మాత్రం 18వ తేదీ వరకు సరఫరా చేస్తున్నారు. 

 


రామప్ప వద్ద వరల్డ్ హెరిటేజ్‌ డే 

 

శిల్పం, వర్ణం, కృష్ణం - సెలబ్రేటింగ్‌ ది హెరిటేజ్‌ రామప్ప పేరుతో రామప్ప దేవాలయంలో వద్ద వరల్డ్ హెరిటేజ్‌డేను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రముఖులు రానున్నారు. రామప్ప ఆలయ ప్రాంగణంలో ఫుడ్‌ ఫెస్టివల్‌ పెడుతున్నారు. సాయంత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌, డ్రమ్స్‌ వాయిద్యకారుడు శివమణి, సింగర్ కార్తీక్, నవీన్‌తోపాటు పలువురు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. వీటితోపాటు నాట్య ప్రదర్శనలు, లేజర్ షోలు ప్రజలను అలరించనున్నాయి.  


ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 34 పాయింట్లు లేదా 0.19 శాతం రెడ్‌ కలర్‌లో 17,730 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా కాఫీ, క్రిసిల్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


ZEE ఎంటర్‌టైన్‌మెంట్: ఇన్వెస్కో గ్లోబల్, సోమవారం నాడు, బల్క్ డీల్స్ ద్వారా ఈ మీడియా కంపెనీలో 5.11% వాటాను విక్రయించింది. తద్వారా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తనకున్న మొత్తం షేర్లను అమ్మేసి, పూర్తిగా  నిష్క్రమించింది.


ఏంజెల్ వన్: 2023 మార్చి త్రైమాసికంలో, ఏంజెల్ వన్ నికర లాభం గత త్రైమాసికం కంటే 17% వృద్ధితో రూ. 267 కోట్లకు నమోదు చేసింది. అదే సమయంలో ఎబిటా 20% పెరిగి రూ. 370 కోట్లకు చేరుకుంది.


క్విక్‌హీల్ టెక్నాలజీస్: ఏప్రిల్ 26 నుంచి అమల్లోకి వచ్చేలా, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అంకిత్ మహేశ్వరిని నియమిస్తున్నట్లు క్విక్ హీల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ప్రస్తుత CFO నవీన్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేశారు.


ముత్తూట్ ఫైనాన్స్, ధంపూర్ షుగర్ మిల్స్: ముత్తూట్ ఫైనాన్స్, ధంపూర్ షుగర్ మిల్స్ షేర్లు ఈ రోజు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతాయి. గతంలో ప్రకటించిన డివిడెండ్‌ మొత్తానికి అనుగుణంగా షేర్ల ధర తగ్గుతుంది.


హాత్‌వే కేబుల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో హాత్‌వే కేబుల్ రూ. 14.6 కోట్ల నికర నష్టాన్ని నివేదించగా, కార్యకలాపాల ద్వారా రూ. 459 కోట్ల ఆదాయం వచ్చింది.


TV18 ప్రసారం: TV18 బ్రాడ్‌కాస్ట్ ఏకీకృత నికర లాభం మార్చి త్రైమాసికంలో 76% తగ్గి రూ. 35 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో నికర లాభం రూ. 143 కోట్లుగా నమోదైంది.


పూనావాలా ఫిన్‌కార్ప్: బిర్లా మ్యూచువల్ ఫండ్, బల్క్ డీల్స్ ద్వారా పూనావాలా ఫిన్‌కార్ప్‌లో 4.4 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది


సుబెక్స్: సుబెక్స్ MD & CEO వినోద్ కుమార్ పద్మనాభన్ ముందస్తు పదవీ విరమణ చేస్తున్నారు. కొత్త సీఈవోగా నిషా దత్‌ను కంపెనీ నియమించింది. మే 2 నుంచి ఆమె బాధ్యతలు చేపడతారు.


SBI: డాలర్లలో సీనియర్ అన్‌-సెక్యూర్డ్ నోట్లను పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జారీ చేసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బోర్డు ఈరోజు సమావేశం కానుంది.


గోవా కార్బన్‌: బిలాస్‌పూర్ యూనిట్‌లో కార్యకలాపాలు పునఃప్రారంభమైనట్లు గోవా కార్బన్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలియజేసింది.


డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: ఆరు నెలల కాలానికి కంపెనీ ఛైర్మన్‌గా టికే రామచంద్రన్‌ను కంపెనీ బోర్డు నియమించింది.


ఐపీఎల్‌-2023లో నేడు 


ఇండియన్ ప్రీమియర్‌ లీగు 2023లో మంగళవారం 25వ మ్యాచ్‌ జరుగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడుతున్నాయి. ఈ ఫైట్‌కు ఉప్పల్‌ మైదానం ఆతిథ్యం ఇస్తోంది. చెరో 4 పాయింట్లతో సమంగా ఉన్న వీరిలో మూడో గెలుపు దక్కేది ఎవరికో!


కమాన్‌.. ఆరెంజ్‌ ఆర్మీ!


ఈ సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తర్వాత ఫామ్‌లోకి వచ్చింది. రెండు విజయాలు సాధించింది. విన్నింగ్‌ కాంబినేషన్‌ సెట్టైనట్టే కనిపిస్తోంది. డిస్ట్రక్టివ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను (Harry Brook) ఓపెనింగ్‌కు పంపించడం వరంగా మారింది. అతడు సెంచరీ కొట్టి ప్రకంపనలు సృష్టించాడు. మయాంక్‌ అతడికి అండగా ఉంటాడు. రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌, అభిషేక్ శర్మతో మిడిలార్డర్‌ పటిష్ఠంగా మారింది. ఈ త్రయంలో ఒక్కరు నిలిచినా రన్స్‌ ఫెస్ట్‌ తప్పదు! హెన్రిచ్‌ క్లాసెన్‌ను మర్చిపోవద్దు. వాషింగ్టన్‌ సుందర్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలి. మార్కో జన్‌సెన్‌, భువీ లోయర్‌ ఆర్డర్లో కీలకం అవుతారు. బౌలింగ్‌ పరంగా ఆరెంజ్‌ ఆర్మీకి ఫర్వాలేదు. భువీ, ఉమ్రాన్‌, మార్కో, నట్టూ పేస్‌తో విజృంభిస్తున్నారు. మర్కండే, అభిషేక్‌, మార్‌క్రమ్‌, సుందర్‌ స్పిన్‌ చూసుకుంటారు.


ముంబయిని ఆపలేం!


చివరి రెండు మ్యాచుల్లో వరుస విజయాలతో ముంబయి ఇండియన్స్‌ డేంజర్‌ (Mumbai Indians) బెల్స్‌ మోగిస్తోంది. ఎందుకంటే జస్ప్రీత్‌ బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌ లేకుండానే గెలవడం సింపుల్‌ కాదు! ఎట్టకేలకు కూర్పు కుదిరింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma), ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) పవర్‌ ప్లే విరుచుకుపడితే అడ్డుకొనేవాళ్లే ఉండరు. వీరిద్దరిలో ఎవరో ఒకరు అటాకింగ్‌ మోడ్‌లోనే ఉండాలి. వరుస డకౌట్ల నుంచి సూర్యకుమార్‌ తేరుకున్నట్టే ఉంది. కేకేఆర్‌ మ్యాచులో డిస్ట్రిక్టివ్‌గా ఆడాడు. హైదరాబాదీ తిలక్‌ వర్మ  (Tilak Varma) ఆ జట్టుకు అత్యంత కీలకంగా మారాడు. కామెరాన్‌ గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ నిలిస్తే బంతులు స్టాండ్స్‌లో పడతాయి. అర్జున్‌ తెందూల్కర్‌ను కొనసాగించొచ్చు. హృతిక్‌ షోకీన్‌, పియూష్ చావ్లా తమ స్పిన్‌తో అపోజిషన్‌ టీమ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. రిలే మెరిడీత్‌, డువాన్‌ జన్‌సెన్‌, అర్జున్‌, అర్షద్‌, టిమ్‌ డేవిడ్‌ పేస్‌ ఫర్వాలేదు. ముంబయి అస్సలు డిఫెన్సివ్‌ అప్రోచ్‌కు వెళ్లొద్దు. అటాకింగ్‌ చేసినంత వరకు వారికి ఎదురుండదు.