YV Subbareddy: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సుజాత, గవర్నమెంట్ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే గిరిధర్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.


గోశాలలో రోజుకు 4 వేల లీటర్ల పాల ఉత్పత్తి దిశగా కార్యాచరణ..


తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజు వారి అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీ  గోశాలలో నిర్మించిన ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం టీటీడీ ‌చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో.ఏవి ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వచ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు చేయడం జరిగిందన్నారు


లేగ దూడల పెంపకం, గోవుల పెరుగుదల, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, నాణ్యమైన పాల ఉత్పత్తికి మనం గోవులకు అందించే మేతకు అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి, దేశవాళీ గోసంతతిని మరింత అభివృద్ధి చేయడం కోసం వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన న్యూటెక్‌ బయోసైన్సెస్‌ సంస్థతో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఇందుకోసం రూ.11 కోట్లతో టీటీడీ సొంతంగా ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నిర్మించుకుందని, ఇందులో దాత ఒకరు రూ 2 కోట్లు విరాళం అందించారని తెలిపారు. ఈ ప్లాంట్‌లో ఈ రోజు నుంచే దాణా ఉత్పత్తి జరుగుతుందని, టీటీడీ అవసరాలకు రోజుకు అవసరమయ్యే నాలుగు వేల లీటర్ల పాలను గోశాలలోనే ఉత్పత్తి చేయడం కోసం ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు.


గోవులకు బలవర్ధకమైన సమగ్ర దాణా అందించడం ద్వారా పాల ఉత్పత్తి ఇప్పటి కంటే 10 నుంచి 15 శాతం పెరుగుతుందని, ఇక్కడ తయారు చేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్‌ శాతం మరింత అధికంగా లభిస్తుందని ఆయన అన్నారు. దీనివల్ల టీటీడీకి ప్రతి రోజు అవసరమయ్యే 4 వేల లీటర్ల పాల అవసరాన్ని దశలవారీగా చేరుకునే అవకాశం లభిస్తుందని, దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో  500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించాంమని, ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకుని వచ్చాంమని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.


అగరబత్తుల రెండో యూనిట్‌..


టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో పరిమళభరితమైన  అగరబత్తులను తయారు చేసి భక్తులకు అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చిందని తెలిపిన టిటిడి ఛైర్మన్, బెంగళూరుకు చెందిన దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సహకారంతో 2021 సెప్టెంబరు 13వ తేదీన టీటీడీ ఈ అగరబత్తులను తయారు చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు రూ.30.66 కోట్ల విలువైన అగరబత్తులను భక్తులకు విక్రయించడం జరిగిందన్నారు. ఈ అగర్బత్తులకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్‌ రావడంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ వద్దే రూ 2 కోట్లతో రెండవ యూనిట్‌ సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోజుకు 15 వేల అగరబత్తుల ప్యాకెట్లు తయారు అవుతున్నాయని, రెండో యూనిట్‌ ప్రారంభించడం వల్ల ఈ సంఖ్య రోజుకు 30 వేల ప్యాకెట్లకు పెరుగుతుందన్నారు. దీనివల్ల సుమారు 200 మంది స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోందని, భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంతోపాటు అగరబత్తులను కూడా ప్రసాదంగా అందించడానికి ముందుకొస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో స్వామి వారి అగరబత్తులు ప్రతి భక్తుడికి చేరే అవకాశం ఉందన్నారు. డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని కూడా పెంచే దిశగా ఏర్పాట్లు చేస్తామని వైవీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


ఆయుర్వేద ఫార్మసీలో ఔషధ ఉత్పత్తుల నూతన కేంద్రం ప్రారంభం..


నరసింగాపురంలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో నూతనంగా నిర్మించిన ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి ప్రారంభించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్, ఈవో నూతన భవనంతోపాటు మందుల ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పూర్వీకులు మనకు అందించిన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి టీటీడీ ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 1983లో ఆయుర్వేద వైద్య కళాశాలను, దానికి అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయుర్వేద ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆయుర్వేద ఆసుపత్రికి అవసరమయ్యే మందులు సొంతంగా తయారు చేసుకోవడం కోసం నరసింగాపురంలో 1990వ సంవత్సరంలో 14.75 ఎకరాల్లో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. మొదట 10 రకాల మందులు మాత్రమే తయారు చేసిన ఈ ఫార్మసీ క్రమేణా 80 రకాల మందులు తయారు చేసి ఆయుర్వేద ఆసుపత్రితో పాటు తిరుపతి, తిరుమలలో డిస్పెన్సరీలకు సరఫరా చేస్తోందన్నారు.


ఫార్మసీని మరింత అభివృద్ధి చేసి ఆయుర్వేద వైద్యాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి మా పాలక మండలి నిర్ణయించిందని చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వివరించారు. ఇందుకోసం ఫార్మసీ భవనాలనూ ఆధునీకరించడంతో పాటు, మూడు ఔషధ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించి రూ.3.90 కోట్లతో అధునాతన యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదట విడతగా తొలి ఔషధ ఉత్పత్తి కేంద్రం శుక్రవారం  ప్రారంభించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పటి దాకా సంవత్సరానికి రూ.1.5 కోట్లు విలువ గల మందులను తయారు చేసే ఈ ఫార్మసీలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఏడాదికి రూ.5 కోట్ల విలువ చేసే మందులను తయారు చేసే సామర్థ్యం లభిస్తుందని ఆయన వివరించారు. ఇక్కడ తయారు చేసే ఆయుర్వేద మందులను టీటీడీ అవసరాలకు పోను, మిగిలినవి ఆయుష్‌ వైద్య శాలలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని చైర్మన్ చెప్పారు. కొన్ని ప్రత్యేకమైన, ప్రాచుర్యం పొందిన మందులను టీటీడీ విక్రయశాలల్లో ప్రజలకు అందుబాటులోకి తేవడానికి  ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. శుక్రవారం ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రంలో మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేస్తారన్నారు. భవిష్యత్‌లో 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి  ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.


పుస్తకావిష్కరణ..


లక్నో, అహమ్మదాబాద్ కు చెందిన ఐఐఎం ప్రొఫెసర్లు ఎన్ రవిచంద్రన్, వెంకటరమణయ్య సుమారు మూడు సంవత్సరాలు కృషి చేసి రాసిన "మ్యానేజింగ్ సోషియల్ ఆర్గనైజేషన్స్ లెషన్ ఫ్రమ్ వరల్డ్ లార్జెస్ట్ పిలిగ్రమేజ్ సెంటర్" పుస్తకాన్ని తిరుపతిలోని పద్మావతి అతిధి గృహంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి  ఆవిష్కరించారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పుస్తక రచయితలు 2017 నుండి 2021 వరకు టీటీడీ యాజమాన్య నిర్వహణ, భక్తుల రద్దీ నిర్వహణ, దర్శనం, అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ లాంటి అన్ని అంశాల్లో టీటీడీ యాజమాన్య పద్ధతుల గురించి పరిశీలన జరిపి ఆ వివరాలు రాశారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కళ్యాణ కట్ట నిర్వహణ విధానం, మహిళలు తలనీలాలు సమర్పించడానికి మహిళా క్షురకులను నియమించిన విషయాలు కూడా చక్కగా వివరించారని చెప్పారు. కల్యాణకట్ట, అన్న ప్రసాదాల పంపిణీ , సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుకుని ఆన్లైన్లో గదులు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం, విరాళాలు తీసుకోవడం లాంటి విషయాల్లో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీ ఎలా వాడుకుంటుందో చక్కగా వివరించారన్నారు. 


ఎంతో ఓపికతో పుస్తకం రాసిన రవిచంద్రన్, వెంకటరమణయ్యను అభినందించారు. 2021 తరువాత టీటీడీ నిర్వహణ, ఆస్తులు, నగదు, బంగారం డిపాజిట్ల అంశాలపై పాలక మండలి శ్వేత పత్రం ప్రకటించిన విషయం చైర్మన్ గుర్తు చేశారు. గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యాలు తయారీ లాంటి నిర్ణయాల గురించి రచయితలకు తెలియజేశారు. శ్రీపద్మావతి హృదయాలయం ఏర్పాటు, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం, విద్యుత్ వాహనాల వాడకం, ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల మంజూరు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అంశాలను చైర్మన్ వివరించారు. వీటితోపాటు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు, దాని ఉద్దేశం, 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం, ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రామాలకు చెందిన వారికి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార ఉచిత దర్శనంతో పాటు ఇతర  అంశాలతో రెండో ఎడిషన్ ముద్రించాలని చైర్మన్ కోరారు.