Tirumala Crime News: తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. వేద విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అది కూడా ఓ షర్టు కోసం కావడంతో తెలిసిన వాళ‌్లు ఆశ్చర్యపోయారు. పట్టణంలోని హెచ్.టి.కాంప్లెక్సులోని ఓ బట్టల దుకాణానికి వేద విద్యార్థి వెళ్లాడు. అక్కడే ఉన్న రమేష్ అనే మరో యువకుడు కూడా బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అయితే ఇద్దరికీ ఒకే షర్టు నచ్చడంతో నాక్కావాలంటే నాక్కావాలని గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన రమేష్.. వేద విద్యార్థిపై కత్తితో దాడికి దిగాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే రమేష్ ని ఆపి... వేద విద్యార్థిని అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. గాయపడిన వేద విద్యార్థిని అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. రమేష్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు.