Kaleshwaram Project: తెలంగాణ ఎన్నికలకు ముందు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల టీమ్ పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం (డిసెంబర్ 29) ఐదుగురు మంత్రులు పరిశీలించారు.  కుంగిపోయిన ప్రదేశాన్ని, తీరును పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర మంత్రులు బ్యారేజీ వద్ద కుంగిపోయిన తీరును పరిశీలించారు. వారి వెంట నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచే తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. అప్పటి నుంచి తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజం అయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వానికి మానస పుత్రిక లాంటిది అయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో 3 నుంచి 4 టీఎంసీలకు మించి నీరు నిల్వ ఉంచబోరని అన్నారు. కానీ కాళేశ్వరంలో 16 టీఎంసీల నీరు ఎలా నిల్వ చేయాలనుకున్నారో అర్థం కావడం లేదని ఉత్తమ్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. రూ.80 కోట్లు ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్లకు పెంచారని అన్నారు. మేడిగడ్డ కుంగడమే కాకుండా.. అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజ్ అయిందని చెప్పారు. దీనిపై తాము న్యాయ విచారణ జరుపుతామని గతంలోనే చెప్పామని అన్నారు.


కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే దురుద్దేుశంతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఆరోపించారు. తమ్మిడి హట్టి వద్ద 3 వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్​ సొంతగా చీఫ్​ ఇంజినీర్ గా పని చేశారా అని ప్రశ్నించారు.


మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఎంత విద్యుత్​ వాడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టిన పెట్టుబడి మొత్తం ప్రయోజనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్​ కూలినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు కూలిందో స్పష్టంగా చెప్పలేకపోయిందని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. డయా ఫ్రాం వాల్ ఆర్​సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. సీకెండ్​ ఫైల్​ ఫెయిల్ అయినందుకే బ్రిడ్జి రోజురోజుకు కుంగిపోయిందని ఆరోపించారు. ప్రొటెక్షన్​ పనులు ఒక్క వరదకే పోతే పనులు ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోందని అన్నారు. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈపై అధికారులకు లేఖ రాశారని గుర్తు చేసినా.. ఎవరూ చర్య తీసుకోలేదని అన్నారు.