CM Jagan Sensational Comments on Janasena Chief Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్ (CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. భీమవరంలో జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena), వసతి దీవెన (Vasathi Deevena) నిధుల విడుదల సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా 3, 4 ఏళ్లైనా కాపురం చేసి ఉండడని ఎద్దేవా చేశారు. 'ఈ మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతున్నారు. నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి ఇలా కార్లు మార్చినట్లుగా భార్యలను మారుస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇలాంటి వారు నాయకులు, సీఎంలు అయితే వీరిని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ చేయడం మొదలుపెడతారు. అలా చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి.?. మన చెల్లెళ్ల పరిస్థితి ఏంటి.?. రాజకీయాల్లో కనీసం ఇలాంటి వారికి ఓటు వేయడం కూడా ధర్మమేనా.?. ఏ భార్యతోనూ 3, 4 ఏళ్లు కాపురం చేయని ఈయన, పొలిటికల్ లైఫ్ లో చంద్రబాబుతో (Chandrababu) కనీసం 10 -15 ఏళ్లైనా ఉండాల్సిందేనని తన క్యాడర్ కు చెబుతున్నారు.' అంటూ విమర్శించారు.


చంద్రబాబుపై విమర్శలు


సీఎం జగన్ ఈ సందర్భంగా చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఈ పెద్ద మనిషి కేవలం అవినీతి కోసమే అధికారాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. ఆ సొమ్ముతో దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేశారని ఆరోపించారు. 'ప్రజలు గుర్తు పెట్టుకునేటట్లుగా చంద్రబాబు ఏ పాలనా చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి. గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేనిది, మీ బిడ్డ ప్రభుత్వంలో 55 నెలల్లో ఎలా చేయగలిగాడు.? అనేది ఆలోచించాలి. వారికి విలువలు, విశ్వసనీయత లేవు. వాళ్ల దృష్టిలో అధికారం అంటే వాళ్లు బాగుపడడం కోసమే. మంచి చేయడం కోసం కాదు.' అంటూ విమర్శించారు.


'పవన్ త్యాగాల త్యాగరాజు'


పవన్ కల్యాణ్ ప్యాకేజీల కోసమే త్యాగాలు చేస్తారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 'ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసే వాడిని చూశాం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం. దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే. ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజును మాత్రం ఈ దత్తపుత్రుడిలోనే చూస్తున్నాం.' అంటూ మండిపడ్డారు. 2 విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా.? అనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు. చంద్రబాబు తాను 14 ఏళ్లు సీఎంగా ఉండగా చేసిన మంచి ఏమీ లేదని, ఇప్పుడు మళ్లీ హామీలతో వస్తున్నారని విమర్శించారు. జగన్ ను ఢీ కొట్టలేమని డిసైడ్ చేసుకుని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారని, ఇలాంటి వారిని నమ్మొచ్చా.? లేదా.? అనేది ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.


Also Read: CM Jagan: 'పేద విద్యార్థులకు పెద్ద చదువులు' - విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్