Ram Mandir Pran Pratishtha:


మూడు డిజైన్‌లు..


అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Mandir Inauguration) ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే...రాముడి విగ్రహానికి సంబంధించి మొత్తం మూడు డిజైన్‌లు తయారు చేయించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. వీటిలో ఏది ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది. ఇవాళ (డిసెంబర్ 29)ఓటింగ్ జరగనుంది. మూడు డిజైన్స్‌లో దేనికి ఎక్కువ ఓట్లు పడితే ఆ విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. 51 ఇంచుల పొడవు ఉన్న ఐదేళ్ల బాల రాముడి విగ్రహం కొలువు దీరనుంది. 


"శిల్పులు మూడు విగ్రహాలు తయారు చేశారు. వీటిలో ఏది ప్రాణప్రతిష్ఠ చేయాలో ఓటింగ్ ద్వారా నిర్ణయించుకోవాలని భావించాం. అందుకే ఓటింగ్ పెట్టాం. ఏ డిజైన్‌కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఆ విగ్రహంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది"


- చంపత్‌ రాయ్, ట్రస్ట్ సెక్రటరీ


శ్రీరామ మందిర్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీపడడం లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది. 


"మొత్తం మూడు దశల్లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టాం. ఇందులో మొదటి ఫేజ్ ఈ డిసెంబర్‌తో ముగిసిపోతుంది. రెండో దశలో ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. మూడో దశలో కాంప్లెక్స్‌లో కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. భద్రతాపరంగానూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం"


- నృపేంద్ర మిశ్రా, నిర్మాణ కమిటీ ఛైర్మన్ 


వరుస కార్యక్రమాలు..


ప్రాణప్రతిష్ఠ జరిగే ముందే కీలక కార్యక్రమాలు నిర్వహించనుంది ట్రస్ట్. జనవరి 17న బాలరాముడి విగ్రహ అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజున భక్తులు మంగళ్ కలశంలో సరయు నది నీళ్లు తీసుకొస్తారు. జనవరి 18న గణేశ్ పూజతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తరవాత వరుణ పూజ, మాత్రిక పూజ, వాస్తు పూజలు జరుగుతాయి. జనవరి 19వ తేదీన హోమం చేయనున్నారు. జనవరి 20న వాస్తు శాంతి చేస్తారు. జనవరి 21వ తేదీన రాముడి విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. ఇక చివరగా జనవరి 22న మృగశిర నక్షత్రంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. 


'అయోధ్య రామయ్య' (Ayodhya Rama Temple) ఆలయం నిర్మాణంలో మన తెలంగాణ (Telangana) కీర్తి  శాశ్వతంగా కనిపించబోతోంది. రామయ్య ఆలయానికి సంబంధించిన తలుపులు, ద్వారాలను అందించే మహద్భాగ్యం మన 'భాగ్య'నగరానికి దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా, శరవేగంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ పలు కళాకృతులను, శిలల వైభవాన్ని పరిశీలించింది.


Also Read: Covid Cases in India: 24 గంటల్లో 5గురు మృతి,ఆందోళన పెంచుతున్న కొత్త వేరియంట్