Changes in Metro Routes: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని రంగాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ... వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో  మెట్రో రైలు నిర్మాణాలపై ఫోకస్‌ పెట్టారు. ఏయే మార్గాలు మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నాయి... వాటి అలైన్‌మెంట్ల పరిస్థితి ఏంటి...? అన్న విషయాలపై ఆరా తీశారు. అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అభ్యంతకరంగా ఉన్న మెట్రో మార్గాల్లో మార్పులు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.  ముఖ్యంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు( Shamshabad Airport) మార్గం మెట్రో రూట్‌ను మార్చాలని డిసైడ్‌ అయ్యారు. 


గత ప్రభుత్వం (బీఆర్‌ఎస్‌ సర్కార్‌) శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్‌ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. దానికి  బదులు ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్‌ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్‌ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. దీని వల్ల... దూరం తగ్గి.. ఖర్చు కూడా  తగ్గుందని భావిస్తున్నారు. అంతేకాదు... ప్రస్తుతం ఉన్న మెట్రో అలైన్‌మెంట్ ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా వెళ్తోంది... దీని ద్వారా ఇప్పటికే ఔటర్‌రింగ్‌ రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో  ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేని రూట్స్ ద్వారా ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్ ఉండేలా డిజైన్‌ను మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


ముందుగా... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కారిడార్‌-2లోని ఫలక్‌నుమా (Falaknuma) నుంచి కొనసాగింపుగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే కారిడార్‌-3లోని రాయదుర్గం (Rayadurgam) నుంచి  కొనసాగింపుగా ఎయిర్‌పోర్టుకి మార్గం వేయాలని గత ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. దీని ప్రకారం... ఆ మార్గం 31 కిలోమీటర్లు  ఉంటుంది. ఈ దూరానికి రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే... ఈ మార్గాన్ని మార్చి ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట (Chandrayanagutta), మైలార్‌దేవ్‌పల్లి (Mylardevpally), పీ7 (P7) రోడ్‌ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మిస్తే... దూరం 13.7 కిలోమటర్లకు తగ్గుందని అధికారులు అంటున్నారు. పైగా ఈ రూట్‌లో పెద్దగా మలుపులు ఉండే అవకాశం లేదు.  అందుకే... ఈ మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం కూడా తగ్గుతుందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డు నుంచి తుక్కుగూడ  వరకు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. అంతకంటే ముందు నాగోల్‌(Nagole) నుంచి ఎల్బీనగర్‌ (LB Nagar) వరకు మధ్యలో మిగిలిన 5 కిలోమీటర్ల దూరాన్ని మెట్రో మార్గంతో  కలపాల్సి ఉంది. దీనిపై సాధాసాధ్యాలను కూడా పరిశీలించాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.


మెట్రోరైలు మొదటి దశలో మూడు మార్గాల్లో... 69.2 కిలోమీటర్ల మేర పూర్తయి ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఇక... కొత్త ప్రణాళికల ద్వారా హైదరాబాద్‌ నగరం నలువైపులా  అభివృద్ధి సమానంగా జరుగుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ  ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్‌మెంట్‌ మార్చేలా ప్రణాళికలు చేయాలని హైదారాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌కు సూచించారు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి.