హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదికి నిమజ్జనానికి అనుమతి ఇచ్చామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఇదే చివరి అవకాశమని తెలిపింది. హుస్సేన్ సాగర్ లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ తీర్పుపై తెలంగాణ సర్కార్ సుప్రీంలో అప్పీల్ చేసింది. 


నిధులు వృథా


హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదికి నిమజ్జనానికి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌) విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కార్ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇది కొత్త సమస్య కాదని, చాలా ఏళ్లుగా ఉందన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదన్నారు. ఇదచివరి అవకాశమని సీజేఐ చెప్పారు. కోట్లాది రూపాయలు సుందరీకరణ కోసం ఖర్చు చేస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం వల్ల ఆ నిధులు వృథా అవుతున్నాయని అన్నారు. ఇకపై హుస్సేన్‌సాగర్‌లో ఎలాంటి నిమజ్జన, కాలుష్యం పెంచే కార్యక్రమాలు చేపట్టబోమని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాత తదుపరి రాష్ట్ర హైకోర్టు పరిశీలిస్తుందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.  


అసలేం జరిగిందంటే..


ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. పీవోపీ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసులను ఆదేశించింది. గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగియడంతో హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 


హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని పీవీ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్‌ డ్యాం తరహా ఏర్పాట్లు చేసి నిమజ్జనం చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని సూచించింది. దూరం నుంచి వచ్చే భక్తులు హుస్సేన్‌సాగర్‌ వైపు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇళ్లలోనే నిమజ్జనం పూర్తి చేసేలా చూడాలని తెలిపింది. 


Also Read: TS High Court: మీకు నిర్లక్ష్యమా? మేమే జోక్యం చేసుకుంటాం.. సర్కార్‌పై హైకోర్టు సీరియస్


రివ్యూ పిటిషన్ 


ఈ విషయంపై తెలంగాణ సర్కార్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. తీర్పును సవరించాలని కోరింది. కానీ ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఆంక్షలు ఎత్తివేయడం కుదరదని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. 


Also Read: Ganesh Immersion: గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. పిటిషన్ విచారించనున్న సీజేఐ ధర్మాసనం