Blasphemy in Pakistan: పాకిస్థాన్‌లో చట్టాలన్నీ విచిత్రంగానే ఉంటాయి. మనకి సాధారణం అనిపించే తప్పుల్ని అక్కడ చాలా పెద్ద నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు. ముఖ్యంగా దైవ భక్తి విషయంలో మరింత కచ్చితంగా ఉంటుంది ఆ దేశం. ఓ 22 ఏళ్ల కుర్రాడు వాట్సాప్‌లో దైవదూషణ చేస్తూ మెసేజ్‌లు పంపినందుకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని కోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. మహమ్మద్ ప్రవక్త్‌పై అనుచిత వీడియోలు, ఫొటోలు వాట్సాప్‌లో షేర్ చేసినందుకు ఇంత కఠినంగా వ్యవహరించింది. మరో 17 ఏళ్ల యువకుడికీ శిక్ష విధించింది. మైనర్ కావడం వల్ల జీవిత ఖైదుతో సరిపెట్టింది. దైవదూషణ పాకిస్థాన్‌లో చాలా పెద్ద నేరం. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంత పెద్ద శిక్ష విధించలేదు. కాకపోతే...ఇలా దైవ దూషణ చేసే వ్యక్తులను స్థానికులే కొట్టి చంపిన ఘటనలు చాలానే జరిగాయి. 2022లోనే ఈ యువకుడిపై పాకిస్థాన్‌  Federal Investigation Agency (FIA) కి చెందిన సైబర్ క్రైమ్ యూనిట్‌ ఫిర్యాదు చేసింది. వాట్సాప్‌లో కొంత మంది నుంచి ఆ యువకుడికి అనుచిత వీడియోలు వచ్చినట్టు ఆరోపించింది. వెంటనే విచారణ చేపట్టిన FIA యువకుడి ఫోన్‌లో ఆ వీడియోలని, ఫొటోలను గుర్తించింది. అయితే...ఆ యువకుల తరపు న్యాయవాదులు మాత్రం ఈ తీర్పుని వ్యతిరేకించారు. వాళ్లకు తెలియకుండానే ఆ ట్రాప్‌లో చిక్కుకున్నారని వాదించారు. పైకోర్టులో పిటిషన్ వేస్తామని వెల్లడించారు. గతేడాది ఆగస్టులోనూ ఓ ఘటన సంచలనం సృష్టించింది. ఇద్దరు క్రిస్టియన్స్‌ ఖురాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మొత్తం 80 క్రిస్టియన్ ఇళ్లని, 19 చర్చ్‌లను స్థానికులు ధ్వంసం చేశారు. 


దైవదూషణ చేసిన ఓ వ్యక్తికి యాంటీ టెర్రరిజం కోర్టు గతేడాది మరణ శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌ గ్రూప్‌లలో దేవుడిని దూషిస్తూ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినందుకు ఈ శిక్ష విధించింది. పెషావర్‌లోని కోర్టు ఈ తీర్పునిచ్చింది. మరణశిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించింది. రూ.12 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పాకిస్థాన్‌లో ఎవరైనా సరే వేరే వాళ్ల ఫోన్‌ను ముట్టుకోకూడదు. అలా చేశారా...వెంటనే శిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా ఫోన్‌ తీసుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పైగా 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాలి. అంతే కాదు. అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి జీవించేందుకు వీల్లేదు. అంటే లివిన్‌ రిలేషన్‌షిప్‌లు కుదరవన్నమాట. పెళ్లికి ముందే ఇలా కలిసున్నారని తెలిస్తే ఇద్దరినీ జైలుకు పంపుతారు. ఇప్పుడు మరో చట్టం గురించి చెప్పుకుందాం. సాధారణంగా పాకిస్థాన్‌లో అక్షరాస్యత చాలా తక్కువ. అయితే...అక్కడ కొన్ని పదాలను ట్రాన్స్‌లేట్ చేయటం చాలా పెద్ద నేరం. అల్లా, మసీద్, రసూల్, నబీ అనే పదాలను ఇంగ్లీష్‌లోకి అనుమతించడాన్ని పాక్ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది. అవి ఎలా ఉన్నాయో అలానే రాయాలి తప్ప వాటిని అనువదించకూడదు. అలా కాదని రూల్ బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. 


Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం ప్రారంభం, సేలా టన్నెల్‌కి ఎన్నో ప్రత్యేకతలు