Sonia Gandhi to Join Bharat Jodo Yatra:


అక్టోబర్ 6 నుంచి మళ్లీ మొదలు..


పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటి భారత్ జోడో యాత్ర. ఇప్పటికే రాహుల్ గాంధీ...ఈ పాదయాత్రలో చాలా బిజీగా ఉన్నారు. కేరళలో మంచి రెస్పాన్స్ రావటం..పార్టీలో జోష్ నింపింది. అక్కడి నుంచి కర్ణాటకకు చేరుకుంది ఈ యాత్ర. భాజపా పాలిత రాష్ట్రం కావటం, వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికలు ఉండటం వల్ల కాంగ్రెస్ కర్ణాటకపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా ఇక్కడా యాత్రను సక్సెస్ చేయాలని భావిస్తోంది. అందుకే...ఈ సారి రాహుల్‌తో పాటు సోనియా గాంధీ కూడా జోడో యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆమె మైసూర్‌ చేరుకున్నారు. విజయదశమి సందర్భంగా రెండ్రోజులు గ్యాప్‌ ఇచ్చి అక్టోబర్ 6వ తేదీ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభించనుంది కాంగ్రెస్. అప్పటి నుంచి సోనియా కూడా పాల్గొంటారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC)చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, AICC జనరల్ సెక్రటరీస్ కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా మైసూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి సోనియాకు స్వాగతం పలికారు. ప్రస్తుతానికి భారత్‌ జోడో యాత్ర శ్రీరంగపట్నకు చేరుకుంది. ఈ రెండు రోజులూ...సోనియా కొడగులో ఉంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 


ఉత్సాహంగా రాహుల్..


భారత్‌ జోడో యాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీలో ఉత్తేజం నింపేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే కేరళలో యాత్రను ముగించుకున్న రాహుల్...ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో కాన్నా కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు. మైసూర్‌లో భారత్ జోడో యాత్రను పున:ప్రారంభించిన రాహుల్...భారీ వర్షం పడుతున్నా...అలాగే నించుని పార్టీ కార్యకర్తలతో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ స్పీచ్‌ వీడియో కాంగ్రెస్ వర్గాల్లో బాగానే వైరల్ అవుతోంది.  రాహుల్ గాంధీ కూడా తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "భారత్‌ను ఏకం చేయాలనుకునే మా సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు. భారతదేశ ప్రజల గొంతుకను వినిపించకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ భారత్ జోడో యాత్రనూ ఎవరూ నిలువరించలేరు" అని రాహుల్ ట్వీట్ చేశారు. 


దసరా సందర్భంగా విశ్రాంతి..


సెప్టెంబర్ 7వ తేదీన భారత్ జోడో యాత్రను ప్రారంభించింది కాంగ్రెస్. కన్యాకుమారి నుంచి మొదలై...ఇప్పుడు కర్ణాటకకు చేరుకుంది. ఇప్పటికి 624 కిలోమీటర్ల మేర యాత్ర ముగిసింది. ఇవాళ పాదయాత్ర ప్రారంభించి రెండ్రోజులు బ్రేక్ తీసుకోనున్నారు రాహుల్. విజయదశమి ఉత్సవాల కారణంగా...విశ్రాంతి తీసుకుంటారు. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటం, రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉండటం..కాంగ్రెస్ యాత్రపై అంచనాలు పెంచుతున్నాయి. ఆదివారం రాహుల్...ఖాదీ కోఆపరేటివ్‌ను సందర్శించారు. ఆ తరవాత..పార్టీ కార్యకర్తలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే వర్షం కురిసింది. "బహుశా మహాత్మా గాంధీజీ స్వర్గం నుంచి కిందికి చూస్తున్నారేమో. ధైర్యంగా ముందుకు సాగిపోమని ఆశీర్వాదం ఇస్తున్నారు" అని కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వర్షంలో తడుస్తూ స్పీచ్‌ ఇస్తున్న ఫోటోని దీనికి యాడ్ చేశారు. 


Also Read: Mulayam Singh Yadav Health: ములాయం సింగ్ పరిస్థితి విషమం- క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలింపు!