Mulayam Singh Yadav Health: యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆయన్ను క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చేర్చారు. వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. 






కొద్ది రోజులుగా


గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం సీరియస్ కావడంతో ములాయంను గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ICUకి మార్చారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ను సీసీయూలో చేర్చారు. ములాయంకు వయసు మీద పడటంతో అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. 


ప్రధాని ఆరా


ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. 


రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఆసుపత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి.


ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్.. సమాజ్‌వాదీ కార్యకర్తలకు తెలిపారు. 


ములాయం సింగ్.. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో స్వయంగా పార్లమెంటుకు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉండటంతో వీల్‌ ఛైర్‌లోనే పార్లమెంటుకు వచ్చారు. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో జరిగిన పార్లమెంటు సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగం సమయంలో కూడా ములాయం పార్లమెంటుకు వచ్చారు. ఆ సమయంలో కూడా ములాయం సింగ్ వీల్ ఛైర్‌లోనే వచ్చారు.






Also Read: Jansuraj Padyatra: 3,500 కిమీ పాదయాత్ర ప్రారంభించిన పీకే- జనాలు లేక నిరాశ!


Also Read: Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!