7th August 2024 School News Headlines Today: 

 

నేటి ప్రత్యేకత:

జాతీయ చేనేత దినోత్సవం 

వ్యవసాయ శాస్త్రవేత్త,హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ జననం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ వర్ధంతి

 

క్రీడా వార్తలు

పారిస్‌ ఒలింపిక్స్‌లో అంచనాలు నిలబెడుతూ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అదరగొట్టింది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫైనల్‌ చేరి భారత్‌కు మరో పతకం ఖాయం చేసింది. సెమీఫైనల్లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్‌ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేశ్‌ రికార్డు సృష్టించింది. 

 

గత ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరోసారి పతకం దిశగా అడుగేశాడు. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో జావెలిన్‌ను 89.34 మీటర్లు విరిసి ఫైనల్‌ చేరాడు. ఫైనల్లోనూ నీరజ్‌ ఇదే త్రో రిపీట్‌ చేస్తే భారత్‌కు మరో స్వర్ణ పతకం రావడం ఖాయమే. 

 

ఒలింపిక్స్‌లో మరోసారి భారత హాకీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. జర్మనీతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. ఓ దశలో భారత్‌-జర్మనీ స్కోరు 2-2తో సమమైంది. మ్యాచ్‌ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా జర్మనీ గోల్‌ చేసి ఆధిక్యాన్ని 3-2కు పెంచింది. ఆ తర్వాత దాన్ని నిలుపుకుని ఫైనల్‌ చేరింది. భారత్‌ మరోసారి కాంస్య పతకం కోసం పోరాడనుంది.

 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో యూ ట్యూబ్‌ ట్రైనింగ్‌ అకాడమీని ఏర్పాటు చేసేందుకు గూగుల్‌ ఆసక్తి చూపుతోంది. యూ ట్యూబ్‌ సంస్థ ప్రతినిధుతో.. ఏపీ సీఎం చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఈ చర్చలు అకాడమీ స్థాపనకు యూ ట్యూబ్‌ ముందుకొచ్చింది.

 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే EWS కోటా కింద పది శాతం సీట్లను భర్తి చేయనున్నారు. ఈ కోటా కింద పూర్తిస్థాయిలో సీట్లు భర్తి చేయాలని నేషనల్‌ వైద్య కమిషన్‌ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేసింది.

 

తెలంగాణ వార్తలు

తెలంగాణలో చివరి విడత రుణమాఫీని స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీని సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే లక్ష, లక్షన్నర వరకు రుణమాఫీ చేశామన్నారు. 

 

హైదరాబాద్‌లో అత్యాధునిక నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కాలుష్య రహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తామని... ఈ ఫ్యూచర్‌ సిటీ పరిశ్రమలకు లాభాల పంట తెచ్చి పెడుతుందని తెలిపారు. అమెరికాలో  పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. 

 

జాతీయ వార్తలు

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్యాంకులో సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను ఛైర్మన్‌గా నియమించారు. ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా ఈ నెల 28న పదవీవిరమణ చేయనుండగా, అదేరోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 

 

ఐఐటీ మద్రాస్‌ 228 కోట్ల రూపాయల విరాళం అందించిన   ఇండో మిమ్‌ సంస్థ ఛైర్మన్‌ కృష్ణా చివుకుల... ఆ విరాళాన్ని అందించడానికి అమెరికా నుంచి భారత్‌ వచ్చారు. తాను ఆనందంగా ఉండేందుకే 228 కోట్ల విరాళం ఇచ్చానని ఆయన తెలిపారు. తానేమీ ఆశించడం లేదని అన్నారు.

 

అంతర్జాతీయ వార్తలు

బంగ్లాదేశ్‌లో  నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో 

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ పార్లమెంటును రద్దు చేయగా.. తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. 

 

మంచి మాట

కష్టాలను చిరునవ్వుతో...ఒత్తిడిని మనో బలంతో... విమర్శలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి.