Same-Sex Marriage:


రాష్ట్రాల అభిప్రాయాలు కీలకం: కేంద్రం 


స్వలింగ వివాహాలపై (Same Sex Marriage) దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై అభిప్రాయాలేంటో చెప్పాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణను ఖండిస్తున్న కేంద్రం...ప్రొసీడింగ్స్‌లో రాష్ట్రాలనూ చేర్చాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే...సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అందుకే వెంటనే కేంద్రం అలెర్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఆయా ప్రభుత్వాల అభిప్రాయాలేంటో తెలుసుకుని పూర్తి స్థాయి నివేదికను కోర్టులో సమర్పించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఇదే విషయాన్ని వెల్లడించింది కేంద్రం. ఈ విచారణలో రాష్ట్రాల అభిప్రాయాలూ కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే అంశం రాష్ట్రాల చట్ట పరిధిలోనూ ఉంటుందని, అందుకే ప్రొసీడింగ్స్‌లో వాళ్లనూ చేర్చడం మంచిదని వివరిస్తోంది. దీనిపై ఓ "ఉమ్మడి అభిప్రాయం" ఏంటో తెలుసుకోవడం ముఖ్యమని చెప్పింది. అప్పటి వరకూ విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది. కానీ కోర్టు మాత్రం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 






భిన్న వాదనలు 


ఇలాంటి కొత్త తరహా బంధాలకు చట్టబద్ధత కల్పించడం కేవలం పార్లమెంట్‌ ఆమోదంతోనే సాధ్యమవుతుందని వాదిస్తున్న కేంద్రం...ఇవన్నీ పరిశీలించాకే కోర్టు విచారణ చేపట్టాలని వివరిస్తోంది. అయినా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అందుకు ససేమిరా అన్నారు. పిటిషనర్ల వాదనను వినకుండా ఉండలేమని తేల్చి చెప్పారు. కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ( Special Marriage Act)కోణంలేనే ఆలోచించాలని, వ్యక్తిగత చట్టాల జోలికి వెళ్లొద్దని వెల్లడించింది. పిటిషనర్ల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి సేమ్ సెక్స్ మ్యారేజ్‌కి చట్టబద్ధత కల్పించాలని వాదిస్తున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లో "Spouse" అని మాత్రమే ప్రస్తావించాలని...అక్కడ పురుషుడా, మహిళా అన్నది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. 


విచారణ...


స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18వ తేదీ నుంచి వాదనలు విననుంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది . ఈ కేసును విచారిస్తున్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో పరిస్థితులు మారిపోయాయని, స్వలింగ సంపర్కానికి ప్రజల్లో అంగీకారం పెరిగిందని వ్యాఖ్యానించారు. విచారణ ప్రారంభానికి ముందు, జమియత్ ఉలేమా-ఇ-హింద్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయంపై రాష్ట్రాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలని విజ్ఞప్తిచేశారు..  కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. తాము విచారణను వ్యతిరేకిస్తున్నామని, ముందుగా తమ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందనన్నారు.  ముందుగా పిటిషనర్ల వాదనలు వింటామని.. తర్వాత  మీ అభిప్రాయాన్ని చెప్పాలని సీజేఐ సూచించారు.


Also Read: India Population: చైనా రికార్డుని బద్దలు కొట్టనున్న భారత్! జనాభాలో ఫస్ట్ ర్యాంక్‌ మనకేనట!