Russia Ukraine War:


కీవ్‌లో రెండు చోట్ల దాడులు..


ఉక్రెయిన్‌పై రష్యా ఉక్రోశం రోజురోజుకీ పెరుగుతోంది. కెర్చ్ ఘటన జరిగిన తరవాత పుతిన్ దూకుడు మరింత పెంచారు. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలపై రష్యా సైన్యం మిసైల్స్‌తో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని కీవ్‌పైనా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. "కమికేజ్ డ్రోన్స్ (Kamikaze drones)" దాడి చేసినట్టు  తెలిపింది. కీవ్‌లోని రెండు ప్రాంతాల్లో బాంబు దాడులు
జరిగాయి. "ఇలాంటి దాడులు చేయటం వల్ల తమకు ఏదో ఒరుగుతుందని రష్యా అనుకుంటోంది. కానీ...ఓడిపోతామేమోనన్న నిరాశలో ఇలాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతోంది" అని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఉన్న సైన్యం తమకు చాలటం లేదని, రక్షణను ఇంకా పెంచుకోవాల్సి ఉందని అంటున్నారు ఉన్నతాధికారులు. "ఆలస్యం చేసేంత సమయం లేదు. ఇప్పటికిప్పుడు మాకు ఆయుధాలు కావాలి. మా గగనతలాన్ని రక్షించుకుంటూ శత్రువుని మట్టుబెట్టాలి" అని స్పష్టం చేస్తున్నారు. 




40 ప్రాంతాలపై క్షిపణి దాడులు 


క్రిమియాలోని క్రెచ్ వంతెనపై బాంబు దాడి జరిగినప్పటి నుంచి ఉక్రెయిన్‌పై పుతిన్ ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ చేసిన పనేనని చాలా గుర్రుగా ఉన్నారు. అందుకే...ఆ దేశంపై మరింత కక్ష పెంచుకున్నారు. వెంటనే...ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లోని 40 ప్రాంతాలపై క్షిపణుల దాడులు చేసింది రష్యా. రాజధాని కీవ్‌లోనూ దాడి జరిగింది. డ్రోన్‌ల సాయంతో ఇలా విరుచుకుపడింది రష్యా సైన్యం. అయితే...ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది మాత్రం ఇంకా లెక్క తేలలేదు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత కీలకమైన వసతులన్నింటినీ ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌ ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ వాయుసేన..రష్యా డ్రోన్ దాడులను గట్టిగానే ఎదుర్కొంది. ఎదురు దాడికి దిగి రష్యాలోని 25 ప్రాంతాలపై 32 సార్లు దాడి చేసినట్టు వెల్లడించింది. 


ఆ ఘటన తరవాతే..


రష్యా ఆక్రమిత క్రిమియాలోని ఓ బ్రిడ్జ్‌పై బాంబు దాడి జరిగింది. ఓ ట్రక్‌లో బాంబ్ పేలడం వల్ల ఆ వంతెన పూర్తిగా డ్యామేజ్ అయింది. రష్యాను-క్రిమియాను అనుసంధానించే కీలకమైన బ్రిడ్జ్ ఇదే. దీనిపైనే అటాక్ జరగటంపై రష్యా అప్రమత్తమైంది. విచారణకు ఆదేశించింది. 
రష్యా విచారణ కమిటీ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. రష్యా యాంటీ టెర్రరిజం కమిటీ కూడా అప్రమత్తమైంది. ట్రక్ బాంబ్ పేలటం వల్ల వంతెనపై రెండు చోట్ల భారీ డ్యామేజ్ జరిగిందని వెల్లడించింది. అయితే...ఎవరిపైన అయినా అనుమానాలున్నాయా అన్నది మాత్రం 
స్పష్టంగా చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ 70 వ పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగటం చర్చకు దారి తీసింది.క్రిమియా అనేది రష్యాకు చాలా కీలకమైన ప్రాంతం. చెప్పాలంటే...ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది రష్యా. అంతే కాదు. మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టేందుకూ క్రిమియా చాలా వ్యూహాత్మకం. 


Also Read: Anti Hijab Row: ఇరాన్‌ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న బాలీవుడ్ బ్యూటీ!