RSS leader Dattatreya:


మతమార్పిడిపై నిఘా ఉంచాలి: దత్తాత్రేయ


RSS లీడర్ దత్తాత్రేయ హోసబేల్ మత మార్పిడి, జనాభాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "ప్రపంచవ్యాప్తంగా మత మార్పిడి పెరిగిపోతోంది. అందుకే..హిందువుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీనికి పరిణామాలు మనమంతా అనుభవిస్తున్నాం. మతమార్పిడి అనేది పెద్ద కుట్ర. కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని ఈశాన్య ప్రాంతాల్లోకి కొందరు అక్రమంగా చొరబడుతున్నారు. ఇది కూడా మన జనాభాపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి ఈ చొరబాటుని అడ్డుకునే చర్యలు చేపడుతున్నా..మిగతా రాష్ట్రాల్లోనూ ఇది కనిపిస్తోంది. బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో సామాజికంగా సమస్యలు  తలెత్తుతున్నాయి" అని వ్యాఖ్యానించారు దత్తాత్రేయ. మతమార్పిడిపై దృష్టి సారించి "anti-conversion" చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. నాలుగు రోజుల ఆల్‌ ఇండియా RSS మీటింగ్‌లో పాల్గొన్న ఆయన...ఈ కామెంట్స్ చేశారు. మత మార్పిడిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను RSS ఎప్పటి నుంచో చేస్తోందని
గుర్తు చేశారు. "Ghar Wapsi" ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, చాలా మంది మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశారని చెప్పారు. ఇస్లాం, క్రిస్టియానిటీలోకి మారిన వాళ్లు మళ్లీ హిందువులుగా మారిపోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం మత మార్పిడిని నియంత్రించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరముందని అన్నారు దత్తాత్రేయ. వివాహం పేరుతో బలవంతంగా మతం మార్చటాన్ని నియంత్రిస్తూ యూపీ సర్కార్ చట్టం తీసుకురావటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. 


హిందూ జనాభాపై ప్రభావం


మత మార్పిడితోనే హిందూ జనాభాపై ప్రభావం పడుతోందనుకుంటే...అక్రమంగా దేశంలోకి చొచ్చుకుని వస్తున్న వాళ్లతోనూ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు దత్తాత్రేయ. "జనాభా అసమతుల్యత" కు కారణమవుతోందని వెల్లడించారు. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్ వర్తించకుండా నిబంధన తీసుకురావాలని సూచించారు. 


అంతకు ముందు నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోహన్ భగవత్ కూడా జనాభాపై కామెంట్స్ చేశారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని ఈ సందర్భంగా భగవత్ అన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదన్నారు. 
" దేశంలో అన్ని వర్గాల వారికి వర్తించేలా ఓ సమగ్ర 'జనాభా విధానాన్ని' రూపొందించాలి. ఎందుకంటే దేశంలో వివిధ వర్గాల జనాభాలో సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తాయి. 
కొన్ని వర్గాల్లో జనాభా సమతుల్యత లేని కారణంగా తూర్పు తైమూర్‌, కొసావో, దక్షిణ సూడాన్‌ వంటి కొత్త దేశాలు ఏర్పడ్డాయి.   "                                             
-  మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


నాన్‌వెజ్‌పైనా..


జనాభా నియంత్రణపై కూడా మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ వల్ల చైనా పరిస్థితి ఎలా తయారైందో చూడాలన్నారు. ఆహారపు అలవాట్లపై మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. "తప్పుడు ఆహారం తీసుకుంటే తప్పుడు ఆలోచనలే వస్తాయి" అని వ్యాఖ్యానించారు. మాంసాహారం తీసుకునే వాళ్ల గురించి ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థైన భారత్ వికాస్ మార్చ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన భగవత్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కామెంట్స్ చేశారు.


Also Read: Assam News: స్టూడెంట్స్‌కి స్కూటర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రభుత్వం, వారికి మాత్రమే ఆఫర్