Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ABP Desam   |  Murali Krishna  |  04 Dec 2022 04:33 PM (IST)

Pakistan's New Army Chief: పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జనరల్ అసిమ్ మునీర్ భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Pakistan's New Army Chief: పాకిస్థాన్‌కు కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని భారత్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని (Line of Control) రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో మునీర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌తో పాటు జమ్ముకశ్మీర్‌పై భారత్‌ ఇటీవల బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేసింది. వాటిని మేము గమనించాం. మా మాతృభూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడమే కాకుండా.. శత్రువులు మాపై దాడిచేస్తే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.                                                       - అసిమ్ మునీర్, పాకిస్థన్ ఆర్మీ చీఫ్

నియంత్రణ రేఖలో పర్యటన సందర్భంగా అక్కడి సైనికులు, ఆఫీసర్లతో మునీర్ మాట్లాడారు. ఎల్‌ఓసీలో నెలకొన్న తాజా పరిస్థితులు, కార్యాచరణ సంసిద్ధత, భారత్‌ ప్రకటనలపై సైనికాధికారులతో చర్చించారు. జనరల్‌ కమర్‌ జవేద్‌ బజ్వా పదవీ విరమణ అనంతరం నవంబర్‌ 24న పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా అసీమ్‌ మునీర్‌ నియమితులయ్యారు.

చర్చలు లేవ్

పాకిస్థాన్‌తో చర్చలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్‌తో చర్చలు జరిపే సమస్యే లేదన్నారు. 

1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం. "
-                                                   అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సొంతం చేసుకుంటామన్నారు .

Also Read: Congress Steering Committee: బాధ్యతగా ఉండాలి- లేకుంటే పార్టీని వీడాలి: ఖర్గే వార్నింగ్

Published at: 04 Dec 2022 04:25 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.