Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్‌ రంజన్‌కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు

ABP Desam   |  Murali Krishna   |  29 Jul 2022 01:21 PM (IST)

Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీకి సమన్లు జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్.

(Image Source: PTI)

Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది ఎన్‌సీడబ్ల్యూ. ఆగస్టు 3న ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురీ.. రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమైనవి. మహిళలపై ఆయనకున్న మైండ్‌సెట్‌ను ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. భారత అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తినే ఆయన ఇలా అంటే.. ఇతరులతో అధీర్ రంజన్ ఎలా ప్రవర్తిస్తున్నారు? ఆయన రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ అధినేత్రి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు సోనియా గాంధీకి కూడా మేం లేఖ రాశాం. అధీర్‌ రంజన్‌కు సమన్లు జారీ చేశాం. ఆయన వచ్చి క్షమాపణలు చెప్పాలి.                                                                    - రేఖా శర్మ, ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ 

ఇదీ జరిగింది

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే భాజపా ఎంపీలు ఆందోళనకు దిగారు.

లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ప్రధాని మోదీ.. గిరిజనులకు అత్యుత్నత స్థాయి గౌరవం ఇస్తే.. మీరు ఇంతలా అవమానిస్తారా?              "
-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
 
అటు రాజ్యసభలోనూ రాష్ట్రపతి అంశంపై ఆందోళన రేగింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా ఎంపీ లంతా కాంగ్రెస్ క్షమాపణ చెప్పి తీరాలంటూ డిమాండ్ చేశారు.
 
Published at: 29 Jul 2022 01:06 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.