Just In





Today Weather Report: ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Latest Weather In Andhra Pradesh And Telangana: ఆంధ్రప్రదేశ్ల వర్షావరణం నెలకొంటే తెలంగాణలో మంచు మబ్బులు కమ్మేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి.

Andhra Pradesh And Telangana Weather Today: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. కోస్తా తీరం వైపు కదులుతున్న అల్పపీడన ప్రభావం ఉత్తారంధ్రపై గట్టిగానే చూపుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా వరి పంట నాశనం అవుతుందని రైతులు కంగారు పడుతున్నారు.
అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడబోతోందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతోందని అంటున్నారు. ఫలితంగా మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
వర్షాల ప్రభావం కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలపై కూడా ఉంటుందని చెబుతున్నారు. దీని కారణంగా చలి తీవ్రత కాస్త తగ్గింది. అయితే చల్లని గాలులు కారణంగా జలుబు జ్వరాలు వ్యాపిస్తున్నాయి.
8 రాయలసీమ జిల్లాలు మినహా శ్రీకాకుళం జిల్లా నుంచి పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా వరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇది రెండు రోజుల పాటు ఉంటుంది. తర్వాత నార్మల్ అవుతుందని చెబుతున్నారు. ఆదివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని అంటున్న్నారు.
ప్రజలంతా ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు. వారం రోజులపాటు వరి కోతలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వరి కోతలు పూర్తి చేసిన వారు వాటిని భద్ర పరుచుకోవాలని చెబుతున్నారు.
అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అందుకే కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం(Telangana Weather)
తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. అల్పపీడనం ప్రభావం కొన్ని జిల్లాలపై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. చాలా జిల్లాల్లో చలి విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు వచ్చాయి. ఆదిలాబాద్లో తక్కువ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆ జిల్లాలో 6.7 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు: చలి తీవ్రత ఉంటుదని చెబుతున్న అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ వర్షాలు, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.జగిత్యాల, కొమ్రంభీం, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఎల్లో జోన్లో ఉన్నాయి. ఆదివారం, సోమవారం మాత్రం దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
2.1 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు:- హనుమకొండ, ఖమ్మం,
3 నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు:- మహబూబ్నగర్, మెదక్,
5.1 డిగ్రీలు అంత కంటే ఎక్కువ పడిపోయినప్రాంతాలు:- భద్రాచలం, హయత్నగర్
హైదరాబాద్ వాతావరణం(Hyderabad Weather)
హైదరాబాద్లో వాతావరణం నార్మల్గా ఉంటోంది. ఉదయం పొగమంచు ఇబ్బంది పెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో చలి కాస్త తగ్గింది. కానీ మంచు మాత్రం విపరీతంగా కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. కనిష్టఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంటే.. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకు నమోదు కావచ్చని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.