Rahul Gandhi on NEET Cancellation: నీట్‌ వివాదంపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఎగ్జామ్‌ని రద్దు చేయడంపైనా అసహనం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రలో వేలాది మంది విద్యార్థులు పేపర్ లీక్‌లపై తనతో చర్చించారని గుర్తు చేశారు. విద్యాసంస్థలతో పాటు మొత్తం వ్యవస్థను బీజేపీ తన చేతుల్లోనే పెట్టుకుందని, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శించారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీక్‌లను ఆపలేకపోయారని చురకలు అంటించారు. RSS కి చెందిన వాళ్లనే ఏరికోరి విద్యాసంస్థల్లో వైస్‌ ఛాన్స్‌లర్‌లుగా నియమిస్తున్నారని మండి పడ్డారు. బీజేపీ పూర్తిగా విద్యావ్యవస్థను ధ్వంసం చేసిందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసినట్టే ఇప్పుడు విద్యావ్యవస్థనీ ఇలాగే నాశనం చేస్తున్నారని విమర్శించారు. నీట్ పేపర్ లీక్‌లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


"విద్యావ్యవస్థ ఇంత గందరగోళంగా మారడానికి కారణం RSS. ఈ పరిస్థితి మారనంత వరకూ ఇలా పేపర్‌ లీక్‌లు జరుగుతూనే ఉంటాయి. మోదీ విద్యాసంస్థల్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. దాదాపు అన్నిచోట్లా ఆ సంస్థకు (RSS)చెందిన వ్యక్తుల్నే  వైస్‌ఛాన్స్‌లర్‌లుగా నియమిస్తున్నారు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






ఈ వివాదంపై పార్లమెంట్‌లో కచ్చితంగా చర్చిస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఈ విషయంలో క్లీన్ చిట్ వచ్చిందంటే మోదీ ప్రభుత్వాన్ని క్రెడిబిలిటీ లేనట్టే అని తేల్చి చెప్పారు. మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ కేంద్రాలుగా ఈ అవకతవకలు జరిగాయన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఇదో కుంటి ప్రభుత్వం అని విమర్శించిన రాహుల్ గాంధీ..ఈ వివాదంపై స్పందించేందుకు కూడా వాళ్లకు మనసొప్పడం లేదని మండి పడ్డారు. 


Also Read: Viral Video: కానిస్టేబుల్‌కి వడదెబ్బ, హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా వీడియో తీసిన ఎస్సై! బాధితుడు మృతి